-
భారత్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ పర్యటన
-
మెక్రాన్తో స్నేహబంధాన్నిచాటుకున్న ప్రధాని మోడీ
-
ఒకే కారులో ఇరువురు దేశాధినేతల ప్రయాణం
భారత్లో పర్యటిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ తో స్నేహబంధాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాటుకున్నారు. ఒకే కారులో ఇరువురూ కలిసి ప్రయాణించారు. ముంబైలో ద్వైపాక్షిక, ప్రతినిధుల స్థాయి చర్చల్లో ఉభయనేతలు పాల్గొన్నారు. మీడియా సంయుక్త సమావేశానంతరం ఇరువురూ ఒకే కారులో ఇండియా-ఫ్రాన్స్ ఇన్నొవేషన్ ఫోరమ్ వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో మోడీ పోస్ట్ చేశారు.’ముంబైలోని లోక్భవన్లో చర్చలు, మీడియా సమావేశం అనంతరం అధ్యక్షుడు మెక్రాన్తో కలిసి ఇండో-ఫ్రాన్స్ ఇన్నొవేషన్ ఫోరంలో పాల్గొనేందుకు కలిసి బయలుదేరాం’ అని ఆ పోస్ట్ లో మోడీ పేర్కొన్నారు. ఇన్నొవేషన్, ట్రేడ్, టెక్నాలజీ తదితర రంగాల్లో సహకారం పెంపుపై ఇరుదేశాలు దృష్టి సారించిన నేపథ్యంలో అగ్రనేతలిద్దరి మధ్య సాన్నిహిత్యం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదే తొలిసారి కాదు!
గ్లోబల్ నేతలతో కలిసి కారులో మోడీ ప్రయాణించడం ఇదే మొదటిసారి కాదు. ఈనెల మొదట్లో మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో కలిసి కౌలాలంపూర్ ఈవెంట్లో పాల్గొనేందుకు కారులో ప్రయాణించారు. గత ఏడాది డిసెంబర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు ప్రొటోకాల్ను మోడీ పక్కనపెట్టి విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఒకే కారులో లోక్ కల్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసానికి ఇరువురూ కలిసి ప్రయాణించారు. గత నెలలో భారత్లో అధికార పర్యటకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తో గుజరాత్లో కలిసి కారులో ప్రయాణించారు. గత జనవరిలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు మోడీ స్వాగతం పలికారు. అనంతరం ఒకే కారులో కలిసి ప్రయాణించారు.
Read Also: రష్యా ఆయిల్ కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందా? మంత్రి జైశంకర్ ఏం చెప్పారంటే?
