Phone Tapping Case.. కేసీఆర్‌కు సిట్ నోటీసులు?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఈ కేసులో విచారించేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో పలువురు కీలక నేతలను ప్రశ్నించిన సిట్.. తాజాగా కేసీఆర్‌కు కూడా నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రేపు శుక్రవారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌కు నోటీసులు అందజేసి, అక్కడే విచారణ చేపట్టే అవకాశమున్నట్టు సమాచారం అందుతోంది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.

రెండేళ్లుగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు తుది అంకానికి చేరుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. అధికారంలో మార్పు అనంతరం ఈ కేసును ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుని సిట్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసింది. సీపీ సజ్జనార్ నేతృత్వంలో కొత్త బృందాన్ని నియమించి, విచారణకు వేగం పెంచింది. ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులను ఇప్పటికే అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది.

ఈ కేసులో భాగంగా గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన నేతలను సిట్ ఇప్పటికే విచారించింది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, అలాగే మాజీ ఎంపీ సంతోష్ రావులను సిట్ అధికారులు ప్రశ్నించారు. వారి వాంగ్మూలాలను నమోదు చేసి, కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. ఈ విచారణల ఆధారంగానే కేసీఆర్ పాత్రపై మరింత స్పష్టత కోసం సిట్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని కూడా విచారణకు పిలవాలనే నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా కీలకంగా మారింది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో మాజీ సీఎంలను విచారించడం అరుదుగా జరుగుతుంటుంది. కానీ ఈ కేసులో ఆరోపణల తీవ్రత, ఇప్పటికే సేకరించిన ఆధారాల నేపథ్యంలో సిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఫామ్‌హౌస్‌లోనే నోటీసులు ఇచ్చి, అక్కడే ప్రశ్నించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

అయితే కేసీఆర్ ఈ విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను పెంచుతోంది. ఒకవైపు సిట్ నోటీసులు అందజేయడానికి సిద్ధమవుతుండగా, మరోవైపు కేసీఆర్ స్పందన ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది. ఆయన విచారణకు సహకరిస్తారా? లేక న్యాయపరమైన మార్గాలను ఆశ్రయిస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ కేసు పరిణామాలు బీఆర్‌ఎస్ పార్టీలోనూ చర్చకు దారి తీస్తున్నాయి. ఇప్పటికే కీలక నేతల విచారణ పూర్తవ్వగా, ఇప్పుడు పార్టీ అధినేత పేరు ముందుకు రావడం రాజకీయంగా ప్రభావం చూపే అవకాశముంది. రానున్న రోజుల్లో ఈ విచారణ ఎటు మలుపు తిరుగుతుందో, రాజకీయ వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

ALSO READ: Medaram: జాతరకు దూరంగా కొండా సురేఖ.. ఆ విభేదాలే కారణమా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button