
‘కాంతార’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నేపథ్యంలో దానికి ప్రీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. తాజాగా మరో పెద్ద ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కర్నాటకలోని మాణి రిజర్వాయర్ దగ్గర జరుగుతోంది. తాజాగా 30 మంది ఆర్టిస్టులతో వెళ్తున్న పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో హీరో రిషబ్ శెట్టి కూడా అందులో ఉన్నారు. ఈ పడవ మునగడంతో అందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అయితే, కెమెరాలతో పాటు ఇతర సినిమా పరికరాలు నీటిపాలయ్యాయి. ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వరుసగా చనిపోతున్న ‘కాంతార’ నటులు
2022లో విడుదలైన ‘కాంతార’ సినిమా దేశ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సుమారు రూ. 25 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ నేపథ్యంలో ‘కాంతార’కు ప్రీక్వెల్ గా ‘కాంతార ఛాపర్ట్ 1’ తెరకెక్కిస్తున్నారు. రిషబ్ శెట్టి ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పలువురు చనిపోవడం ఆందోళన కలిగిస్తుంది.
ఇంకా ఎన్ని విషాదాలు చూడాలో?
గత ఏడాది నవంబర్ లో ఈ సినిమాకు సంబంధించిన జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణించే వ్యాన్ ప్రమాదానికి గురయ్యింది. మేలో కపిల్ అనే నటుడు ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోయాడు. అదే నెలలో రాకేష్ అనే మరో నటుడు గుండెపోటుతో చనిపోయాడు. అటు నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ నిజూ కూడా గుండెపోటుతో చనిపోయాడు. వరుస ప్రమాదాలు, మరణాలు ‘కాంతార’ టీమ్ ను ఆందోళనకు గురి చేస్తుంది. సినిమా అయిపోయే సరికి ఇంకా ఏ విషాదాలు చూడాల్సి ఉందో అని టెన్షన్ పడుతున్నారు.
Read Also: కాసేపట్లో పోస్టుమార్టం, ఇంతలో అసలు యువకుడు ప్రత్యక్షం!