
Nitin Gadkari: ఉన్నది ఉన్నట్లు తనదైన శైలిలో కామెంట్స్ చేసే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు, రాజకీయ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మోసం చేసిన వాళ్లే గొప్ప నాయకులు అవుతున్నారని చెప్పుకొచ్చారు. నాగ్ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజల్ని బాగా మూర్ఖుల్ని చేయగలిగే వారే ఉత్తమ నాయకులవుతున్నారని చెప్పారు. మాటలు చెప్పడం తేలికని, పని చేయడం కష్టమన్నారు. నిజాన్ని మనస్ఫూర్తిగా చెప్పడం వల్ల ఎంత నిరుత్సాహానికి గురి కావాల్సి వస్తోందో క్షేత్ర స్థాయిలో తాను అనుభవిస్తున్నానని గడ్కరీ వివరించారు.
ప్రతి ఒక్కరికీ వారి సొంత శైలి, ఉద్దేశాలు ఉంటాయని గడ్కరీ తెలిపారు. అంతిమంగా ప్రజల్ని మూర్ఖుల్ని చేయడం ద్వారా వారిని ఒప్పించగలిగే నాయకుడు తరచూ విజయం సాధిస్తాడన్నారు. ఇదే సమయంలో నిజానికి ఉన్న విలువను ఆయన నొక్కి చెప్పారు. సత్యమే అంతిమంగా విజయం సాధిస్తుందని భగవద్గీతలో కృష్ణుడు చెప్పారనే విషయాన్ని గుర్తు చేశారు. అడ్డదారులు తొక్కితే ఏమవుతుంది? అనే విషయాన్ని ప్రస్తావించారు. విజయాలు సాధించడానికి అడ్డదారులుంటాయని, నిబంధనలను ఉల్లంఘించవచ్చు, ప్రమాద సంకేతాలను దాటొచ్చు, ముందుకు దూకి వెళ్లొచ్చు.. అయితే అడ్డదారులు మనల్ని తక్కువ చేస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు గడ్కరీ.