కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదకర ఘటన వెలుగుచూసింది. ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటలను నమ్మి తీవ్ర భయానికి లోనైన సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. తాను త్వరలోనే చనిపోతానని చెప్పిన జ్యోతిష్యుడి మాటలు నిజమవుతాయనే ఆందోళనతో, మృత్యువు తనను చేరేలోపే తానే ప్రాణాలు తీసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని బాగలకుంటె ఎంఈఐ లేఔట్లో నివసిస్తున్న విద్యాజ్యోతి అనే యువతి ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. ఇటీవలే ఆమె కొడగు ప్రాంతానికి చెందిన యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ మధ్య ఆమె ఓ జ్యోతిష్యుడిని సంప్రదించగా, తాను ఎక్కువ కాలం జీవించలేదని, త్వరలోనే మరణం సంభవిస్తుందని చెప్పినట్టు సమాచారం. అంతేకాక, తనకు శుభం కలగాలంటే తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసి, చివరి రోజున తాళిని అమ్మవారికి సమర్పించాలని సూచించినట్టు తెలుస్తోంది.
జ్యోతిష్యుడి మాటలను నిజమని నమ్మిన విద్యాజ్యోతి తీవ్ర ఆందోళనకు గురై, అతను చెప్పినట్టుగానే తొమ్మిది రోజుల పాటు పూజలు చేసింది. చివరి రోజున తాళిని సమర్పించేందుకు సిద్ధమైన ఆమె.. అంతకుముందు గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. చాలాసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపు బద్దలకొట్టి లోపలికి వెళ్లగా, ఆమె ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ALSO READ: Mutton Curry: మటన్ కర్రీని ఇలా వండి తింటే.. ముక్కతో పాటు చేతి వేళ్లను కూడా వదలరు..
