- ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన
- చదువుకోవాలన్నందుకు తండ్రిని చంపిన కొడుకు
- మృతదేహాన్ని ముక్కలు చేసి డ్రమ్ములో దాచిన పుత్రరత్నం
ఉత్తర ప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. పరీక్షలకు ప్రిపేర్ కావాలన్న తండ్రిని ఓ కొడుకు దారుణంగా హత్య చేశాడు. తుపాకీతో కాల్చి చంపడంతో పాటు మృతదేహాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో దాచి పెట్టాడు. ఈ ఘటన యూపీ సంచలనం సృష్టించింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
నీట్ పరీక్షకు సిద్ధం కావాలని పదేపదే ఒత్తిడి చేయడంతో ఆగ్రహానికి గురైన ఓ కుమారుడు, తన తండ్రిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములో దాచిపెట్టాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్నవూలో వెలుగుచూసింది.
మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు
పాథాలజీ ల్యాబ్ యజమాని మానవేంద్ర ప్రతాప్ సింగ్ ఈనెల 20 నుంచి కనిపించకుండా పోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు అక్షత్(19)ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, అసలు నిజం బయటపడింది. తండ్రిని తానే చంపినట్లు విలపిస్తూ ఒప్పుకున్నాడు. అక్షత్ గతంలో ఇంటర్ పూర్తి చేసి, ప్రస్తుతం బీకామ్ చదువుతున్నాడు. అయితే, డాక్టర్ కావాలని, నీట్ పరీక్షకు సిద్ధం కావాలని అతడిని తండ్రి నిరంతరం ఒత్తిడి చేస్తూ తిడుతుండేవాడని అక్షత్ చెప్పాడు. ఆయన ఒత్తడి తట్టుకోలేకే ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పాడు. ప్రస్తుతం పోలీసులు అతడిని జైలుకు పంపించారు.

