
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగన్న మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న (శుక్రవారం) జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కూడా రంగన్న మృతిపై చర్చ జరిగింది. రంగన్న మృతి అనుమానాస్పదంగా ఉందని కొందరు మంత్రులు సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షులు, అనుమానితులు ఒక్కొక్కరు చనిపోతున్నారని.. దీని వెనుక కుట్ర ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో.. వెంటనే డీజీపీ హరీష్కుమార్ గుప్తాను పిలిపించి వివరాలు తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. రంగన్న మృతిపై అనుమానాలు ఉన్నాయని డీజీపీ చెప్పడంతో… పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆదేశించారు ఏపీ ముఖ్యమంత్రి.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు, అనుమానితులుగా ఉన్నవారు ఒక్కొక్కరుగా చనిపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది కూటమి ప్రభుత్వం. కటికరెడ్డి శ్రీనివాసులురెడ్డి, డ్రైవర్ నారాయణయాదవ్, కల్లూరి గంగాధర్రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, డాక్టర్ వైఎస్ అభిషేక్రెడ్డి, వాచ్మెన్ రంగన్న… వీరంతా వైఎస్ వివేకా హత్య కేసులో సాక్ష్యులు, అనుమానితులు. ఒక్కొక్కరిగా ప్రాణాలు విడిచినవారు. అందరూ అనారోగ్యంతోనే మరణించారు. కానీ, వీరి మరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పరిటాల హత్య కేసులోనూ ఇలానే జరిగిందని సీఎం చంద్రబాబు కూడా నిన్న కేబినెట్ సమావేశంలో చెప్పారు. ఆ కేసులోనూ నిందితులు ఒకరి తర్వాత మరొకరు మరణించినట్టు తెలిపారు. వివేకా కేసులోనూ ఇలానే జరుగుతుందంటే… కేసును నీరుగార్చే కుట్ర ఏమైనా జరుగుతుందా..? అనే కోణంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
Read More : తమిళనాడు గవర్నర్గా విజయసాయిరెడ్డి – ఇందంతా జగన్ స్కెచ్చేనా?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరుగురు సాక్ష్యుల మరణానికి గల కారణాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండేది..? ఉన్నట్టుండి ఆరోగ్యం ఎందుకు పాడైంది..? నిజంగా ఆరోగ్య సమస్యతోనే మరణించారా…? అనేది పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. మరి ఈ కేసులో తీగ లాగితే.. డొంక కదులుతుందా…? రంగన్న మృతి నిజంగానే అనుమానాస్పదమా…? ఏమో దర్యాప్తులోనే తేలాలి.