
Murder: తమిళనాడులో మరోసారి మానవ సంబంధాలపై నమ్మకాన్ని తుడిచిపెట్టే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కోడలి అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు ఓ వృద్ధుడు అమానుషంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. ఒంటిమీద మంటలు అంటుకుని, తనను కాపాడాలని రోడ్డుపై వెళ్తున్న వారిని వేడుకుంటూ బాధితుడు పరుగులు తీస్తున్న దృశ్యాలు చూసినవారిని కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ హృదయ విదారక సంఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా పన్రుటి సమీపంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రన్ (64) అనే రైతు తన కుమారుడు వివాహం చేసుకున్న జయప్రియ (28) అనే మహిళతో కలిసి ఒకే ఇంట్లో నివసించేవాడు. కొద్ది రోజుల క్రితం రాజేంద్రన్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆ తర్వాత నుంచి జయప్రియ మణికందన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోందని గ్రామంలో చర్చ మొదలైంది. ఈ విషయాన్ని గమనించిన రాజేంద్రన్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ, కుటుంబ పరువు తీసేలా ప్రవర్తించొద్దని కోడలిని నిలదీశాడు. ఇదే విషయంపై రాజేంద్రన్తో మణికందన్కు విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.
ఈ హెచ్చరికలను సహించలేని మణికందన్, రాజేంద్రన్ను అంతమొందించాలని కుట్ర పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు. జనవరి 29 రాత్రి రాజేంద్రన్ తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో, మణికందన్ తన అనుచరులతో కలిసి వ్యాన్లో వచ్చి వారిని అడ్డుకున్నాడు. అనంతరం రాజేంద్రన్పై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఒక్కసారిగా మంటల్లో చిక్కుకున్న రాజేంద్రన్ ప్రాణభయంతో రోడ్డుపై పరుగులు తీయగా, ఆ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అవే వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ ప్రజలను కలచివేస్తున్నాయి.
తీవ్రంగా గాయపడిన రాజేంద్రన్ను స్థానికులు వెంటనే కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుమారు 70 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న ఆయన.. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడి జనవరి 31 రాత్రి తుదిశ్వాస విడిచారు. తొలుత హత్యాయత్నంగా కేసు నమోదు చేసిన పోలీసులు, రాజేంద్రన్ మరణంతో దానిని హత్య కేసుగా మార్చి దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఈ ఘోరానికి పాల్పడిన ప్రధాన నిందితుడు మణికందన్తో పాటు, అతడికి సహకరించిన కోడలు జయప్రియ, మణికందన్ అనుచరుడు గుబేంద్రన్, వ్యాన్ డ్రైవర్ పార్థిబన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను విచారిస్తున్న అధికారులు, ఈ హత్య పూర్తిగా ముందస్తు ప్రణాళికతో జరిగినట్లు అనుమానిస్తున్నారు. కుటుంబ అంతర్గత వివాదాలు ఇంతటి దారుణానికి దారితీయడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తూ, మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
ALSO READ: రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగుతున్నారా? ఎంత డేంజరో తెలుసా?





