భారత దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక మైలురాయిని అధిగమిస్తూ అత్యధిక కాలం పాటు ప్రభుత్వ అధినేతగా సేవలందించిన నాయకుడిగా నిలిచారు. ఆదివారం నాటికి ఆయన మొత్తం 8931 రోజులు అధికారంలో కొనసాగుతూ సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ నెలకొల్పిన 8930 రోజుల రికార్డును అధిగమించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఆయన పరిపాలనా ప్రయాణం, తరువాత ప్రధానిగా కొనసాగిన కాలాన్ని కలిపి ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. దేశ రాజకీయ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు.
గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దీర్ఘకాలం సేవలందించి ప్రత్యేక గుర్తింపు పొందిన మోదీ.. తరువాత దేశ ప్రధానిగా కూడా విశేష అనుభవాన్ని సంపాదించారు. స్వాతంత్ర్యం అనంతరం జన్మించి దేశానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి నాయకుడిగా కూడా ఆయన ప్రత్యేక స్థానం పొందారు. 2014, 2019, 2024 సంవత్సరాల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు తన పార్టీకి విజయాన్ని అందిస్తూ తన నాయకత్వాన్ని మరింత బలంగా చాటుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల మద్దతుతో ఆయన రాజకీయ ప్రయాణం మరింత విస్తరించింది.
గత ఏడాది అక్టోబర్లో తన పాలన 25వ సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భంగా దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన మోదీ.. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో రాష్ట్రం భూకంపం, తుఫానులు, వరుస కరువులు, రాజకీయ అస్థిరత వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నదని ఆయన వివరించారు. అయితే ఆ సమస్యలను అవకాశాలుగా మలుచుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపినట్లు తెలిపారు. పేదల కోసం పనిచేయాలని, అవినీతికి దూరంగా ఉండాలని తన తల్లి ఇచ్చిన మార్గదర్శకాలు ప్రజా జీవనంలో తనకు దిశానిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు. గుజరాత్ను కరువు ప్రభావిత రాష్ట్రం నుంచి మంచి పాలనకు ప్రతీకగా మార్చడంలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలక పాత్ర పోషించాయని చెప్పారు.
2013లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపికైన సమయంలో దేశంలో విశ్వాస సంక్షోభం నెలకొన్నదని మోదీ గుర్తు చేసుకున్నారు. 2014లో ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుతో దేశంలో కొత్త దిశలో ప్రయాణం ప్రారంభమైందని తెలిపారు. గత 11 సంవత్సరాల్లో 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ప్రత్యేక స్థానం సంపాదించిందని వివరించారు. మహిళా శక్తి, యువ శక్తి, రైతుల అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడించారు. దేశానికి సేవ చేయడం తనకు అత్యున్నత గౌరవమని పేర్కొంటూ, రాజ్యాంగ విలువల ఆధారంగా వికసిత భారత్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.
ALSO READ: ప్రతిష్టాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్లో లైంగిక ఆరోపణలు!
