
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. సీఎం స్వయంగా చూస్తున్న మున్సిపల్ శాఖలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించి చర్యలు చేపట్టాలని కోరారు. జీహెచ్ఎంసీలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్స్టంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలంలో చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనుల టెండర్లలో కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయని అన్నారు.
తెలంగాణకు చెందిన బీసీ కాంట్రాక్టర్లకు నష్టం చేసేలా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక విదేశీ సంస్థకు చెందిన వాహనాలు మాత్రమే ఈ పనుల కోసం వినియోగించేలా నిబంధనలు రూపొందించారని ఆరోపించారు. ఆ సంస్థకు హైదరాబాద్లో రెండు షోరూములు మాత్రమే ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత వివరించారు. ఆ షోరూంల నిర్వాహకులు తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లతో ఎంఓయూ చేసుకునేందుకు ససేమిరా అంటున్నారని చెప్పారు.
తెలంగాణ కాంట్రాక్టర్లు కర్నాటక షోరూంల డీలర్ల నుంచి ఎంవోయూలు తెచ్చుకున్నా వాటి ఫిజికల్ కాపీలు తక్కువ వ్యవధిలో తెచ్చి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు వేర్వేరుగా టెండర్లు పిలిచేవారని గుర్తుచేశారు. ఇప్పుడు తొమ్మిది జోన్ల వారీగా మాత్రమే టెండర్లు పిలవడంతో తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం వాటిల్లుతోందని చెప్పారు ఎమ్మెల్సీ కవిత.
అధికారులు పేర్కొన్న స్పెసిఫికేషన్స్ కూడిన వాహనాల్లో ఒక క్యూబిక్ మీటర్ మెటీరియల్ కూడా తరలించడం సాధ్యం కాదని ఎమ్మెల్సీ కవిత వివరించారు. గతంలో ఇందుకు వినియోగించిన వాహనాల్లో రెండు నుంచి మూడు క్యూబిక్ మీటర్ల మెటీరియల్ తరలించే వారని స్పష్టం చేశారు. అధికారులు ఒక సంస్థకు, రెండు కాంట్రాక్ట్ల ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చడంతో ఒక్కో ఏడాదికి రూ.5.85 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. ఈ టెండర్లను వెంటనే రద్దు చేసి.. గతంలో మాదిరిగా వార్డుల వారీగా టెండర్లు పిలిస్తే 150 మంది స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. మున్సిపల్ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన శాఖలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించి వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.