
క్రైమ్ మిర్రర్, అమరావతి :-ఎమ్మెల్యేలే కాదు.. మంత్రులు కూడా చంద్రబాబు మాట వినడం లేదా..? ప్రత్యర్థులకు చెక్ పెట్టడంలో కలిసి రావడం లేదా..? వైసీపీ విమర్శలను తిప్పికొట్టాల్సిన వారు.. మనకెందుకులే అని ఊరుకుంటున్నారా..? కావాలనే ఇలా ప్రవర్తిస్తున్నారా..? ఏది ఏమైనా.. వీరి తీరుతో చంద్రబాబు విసిగిపోయినట్టు ఉన్నారు. మంత్రులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో ఉన్నది కూటమి ప్రభుత్వమే అయినా.. మేజర్ రోల్ మాత్రం టీడీపీదే. అధికారమంతా సీఎం చంద్రబాబుదే. అయినా.. సొంత పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల తీరు.. చంద్రబాబుకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలపై విమర్శలు రావడంతో… పార్టీకి చెడ్డపేరు తెచ్చింది. అప్పుడు.. ఆ ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు. పార్టీ నష్టం కలిగిస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. ఆ ఇష్యూ సద్దుమణిగిందిలే అనుకునేలోపు.. మంత్రుల తీరు ఇబ్బందిపెడుతోంది. మంత్రి పదవుల్లో ఉన్నవారు ఎంత బాధ్యతగా ఉండాలి. ప్రత్యర్థి పార్టీని నోరెత్తకుండా చేయాలి. కానీ… మంత్రులు అలా ఉండటంలేదు. మనకెందుకులే అనే ధోరణి వాళ్లలో కనిపిస్తోంది. టీడీపీ మంత్రులే కాదు.. బీజేపీ, జనసేన మంత్రుల తీరు కూడా అదే విధంగా ఉన్నట్టు సమాచారం.
Read also : యూకే పర్యటన అనంతరం.. కవిత ఆరోపణలపై స్పందించిన హరీష్!
వైసీపీ విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలని… వరుస ప్రెస్మీట్లు పెట్టి కౌంటర్ అటాక్ చేయాలని అధినేత చంద్రబాబు ఎన్నిసార్లు హితబోధ చేసినా మంత్రుల్లో మాత్రం చలనం కనిపించడంలేదు. చంద్రబాబు మాటలను ఈ చెవితో విని.. ఆ చెవితో వదిలేస్తున్నారు అమాత్యులు. అందుకే మంత్రుల తీరుపై ముఖ్యమంత్రి మండిపడుతున్నారు. వైసీపీకి కౌంటర్ ఇవ్వడంలో మంత్రులు వెనుకబడుతున్నారని.. ఇది ఇలాగే కొనసాగితే… పార్టీకి నష్టం తప్పదని అంటున్నారు. అయినా… మంత్రులు తీరు మార్చుకోకపోవడంతో… చంద్రబాబు వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Read also : 2.32 కోట్లు పలికిన హైదరాబాద్ గణపతి లడ్డు!..
వైసీపీ విమర్శలకు మంత్రుల నుంచి కౌంటర్లు పడటం లేదు. కుప్పం నియోజకవర్గానికి కృష్ణా నీళ్లు ఇచ్చే విషయం కావొచ్చు.. యూరియా విషయం కావొచ్చు.. సుగాలి ప్రీతి విషయం కావొచ్చు… అంశం ఏదైనా.. వైసీపీ విమర్శలకు అధికార పార్టీల నుంచి కౌంటర్లు రావడం లేదు. దీంతో.. ప్రభుత్వం.. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు… సీఎం జగన్పై విమర్శలతో విరుచుకుపడిన నేతలు.. ఇప్పుడు చేతిలో అధికారం ఉంది… మంత్రి పదవుల్లో ఉన్నా కూడా నోరుమెదపడం లేదు. ఇదే సీఎం చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. టీడీపీ నుంచే కాదు.. జనసేన, బీజేపీ నుంచి కూడా వైసీపీకి కౌంటర్లు ఇచ్చేవారు కరువయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఎప్పుడో సభలు పెట్టినప్పుడు తప్ప… మిగిలిన సమయంలో సైలెంట్గా ఉంటున్నారు. ఇక ఆ పార్టీ మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ అయితే… ఇటీవల వైసీపీకి గట్టిగా కౌంటర్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇక.. బీజేపీ మంత్రి సత్యకుమార్ కూడా అప్పుడప్పుడు తప్ప.. పెద్దగా స్పందించడంలేదు. దీంతో… ఈ పరిస్థితి ఎలా అధిగమించాలని సీఎం చంద్రబాబు తలపట్టుకుంటున్నారు. మంత్రుల తీరుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారాయన.
Read also : శిథిలాల కింద మహిళలు, పట్టించుకోని రెస్క్యూ సిబ్బంది!