Viral Twist in Mirzapur Murder Case: ఉత్తర ప్రదేశ్లో షాకింగ్ ఘటన జరిగింది. మీర్జాపూర్కు చెందిన 45 ఏళ్ల సీనియర్ న్యాయవాది రాజీవ్ సింగ్ను ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన సమయంలో జరిగిన ఒక విచిత్ర అంశం అందరి ఆకర్షించింది. హత్య చేసి పారిపోవడానికి ప్రయత్నించిన నిందితులకు వారి బైక్ స్టార్ట్ కాకపోవడంతో కొంతసేపు అక్కడే ఇబ్బందులు పడ్డారు.
బైక్ స్టార్ట్ కాకపోవడంతో..
న్యాయవాది రాజీవ్ సింగ్ ప్రతిరోజులాగే ఉదయం వాకింగ్కు వెళ్లారు. అదే సమయంలో ఒక బైక్పై ఇద్దరు వ్యక్తులు ఆయన దగ్గరకు వచ్చి ఆగారు. వారిలో ఒకరు బైక్ నుంచి దిగి నేరుగా రాజీవ్ వద్దకు వెళ్లాడు. తుపాకితో ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో రాజీవ్ అక్కడికక్కడే మృతి చెందారు. దాడి చేసిన వెంటనే ఇద్దరు నిందితులు బైక్పై అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించారు. కానీ, అనుకోకుండా బైక్ స్టార్ట్ కాలేదు. వారు పలుమార్లు కిక్ కొట్టినా కూడా బైక్ పనిచేయలేదు. దాదాపు ఒక నిమిషం పాటు అక్కడే నిలిచిపోయారు. ఈ సమయంలో పరిస్థితి వారికి ఆందోళన కలిగించినట్లు తెలుస్తోంది. చివరికి ఎంతో కష్టపడి బైక్ను స్టార్ట్ చేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు.
ముందే ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా..
ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో కొన్ని ముఖ్య విషయాలు బయటపడ్డాయి. రాజీవ్ సింగ్కు తనపై ప్రమాదం ఉందనే అనుమానం ముందే ఉన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆయన గతంలో పోలీసులకు తెలియజేసినట్లు అధికారులు వెల్లడించారు. రాజీవ్పై గతంలో కూడా రెండు సార్లు దాడి జరిగిందని పోలీసులు గుర్తించారు. దీంతో ఈ హత్యకు పాత వైరం లేదా వ్యక్తిగత విభేదాలే కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తూ వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.
పథకం ప్రకారం జరిగిన ఈ హత్యలో నిందితులు తప్పించుకునే సమయంలో ఎదురైన ఈ చిన్న ఆటంకం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పోలీసులు వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుని కేసును చేధిస్తామని తెలిపారు.
