- రష్యా ఆయిల్ కొనుగోళ్లపై జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- వ్యూహాత్మక అంశాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాం
- మా దేశ ప్రయోజనాలకు అనుగుణంగా అడుగులు వేస్తాం: జైశంకర్
రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందంటూ అమెరికా ప్రకటించిన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉన్న అంశాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడమే భారత దేశ విధానమని మంత్రి స్పష్టం చేశారు. భారత్ ఏ దేశ ఒత్తిడికి గురికాదన్నారు. జర్మనీలో జరుగుతున్న మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్యా చమురు కొనుగోళ్లపై విలేకరులు ఆయనను ప్రశ్నించారు. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయనుందా? అని ప్రశ్నించారు. ఇది దేశ వ్యూహాత్మక నిర్ణయాలపై ప్రభావం చూపుతుందా? అని అడిగారు.
రష్యా ఆయిల్ కొనుగోళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు
అటు ఇంధన కొనుగోళ్ల అంశం సంక్లిష్టమైనదని మంత్రి జైశంకర్ వివరించారు. ఇతర దేశాల్లోని సంస్థల మాదిరిగా భారతీయ ఇంధన కంపెనీలు కూడా తమ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయని తెలిపారు. ధరలు, ఇంధన లభ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇక భారత్ ఎల్లప్పుడూ పూర్తి స్వాతంత్ర్యంతో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. భారత దేశ చరిత్ర చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.
రష్యా ఆయిల్ కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పిందన్న అమెరికా
భారత్తో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పందించారు. రష్యా ఆయిల్ కొనుగోళ్లను నిలిపివేస్తామంటూ భారత్ తమకు హామీ ఇచ్చిందని అన్నారు. ఈ దిశగా ఐరోపా దేశాలు ఇప్పటికే చర్యలు తీసుకున్నాయని అన్నారు. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు.
Read Also: రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు ఉన్నట్టా? లేనట్టా?
