ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్లపై పడుతున్న వేళ, భారతదేశంలో కూడా ఎల్పీజీ, పెట్రోల్ సరఫరాపై అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ, దేశంలో పెట్రోల్ కొరత ఏర్పడిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం కారణంగా ప్రజల్లో ఆందోళన పెరిగి, మంగళవారం ఉదయం నుంచే అనేక ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ కట్టడం ప్రారంభించారు. ఒకరినొకరు చూసుకుని మరింతగా భయపడిన ప్రజలు అవసరానికి మించి ఇంధనం తీసుకునేందుకు ప్రయత్నించడం వల్ల కొన్ని బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోయిన పరిస్థితులు కనిపించాయి. దీంతో కొన్నిచోట్ల నో స్టాక్ బోర్డులు కూడా కనిపించడంతో ప్రజల్లో మరింత అపోహలు పెరిగాయి.
View this post on Instagram
అయితే ఇప్పటి వరకు దేశంలో పెట్రోల్ కొరత ఉందని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సరఫరాలో ఎలాంటి పెద్ద అంతరాయం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నప్పటికీ, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రం ప్రజలను గందరగోళానికి గురి చేస్తోంది. అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయంలో వదంతులను నమ్మి భారీగా క్యూ కట్టడం వల్లే కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సరైన సమాచారం లేకుండా జరిగే ఈ రకమైన చర్యలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల మధ్య గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెట్రోల్ కోసం గంటల తరబడి క్యూ లో నిలబడిన వాహనదారుల మధ్య ఓ ఎలక్ట్రిక్ బైక్ యజమాని వినూత్నంగా స్పందించాడు. తన ఎలక్ట్రిక్ స్కూటీపై స్టైలిష్గా తిరుగుతూ, మాకు మీలాగా క్యూ లో నిలబడాల్సిన అవసరం లేదు, ఎలాంటి టెన్షన్ లేకుండా ఎంత దూరమైనా ప్రయాణించగలమని సెటైరికల్గా ప్రవర్తించాడు. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ విభిన్నంగా స్పందిస్తూ, పెట్రోల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు భవిష్యత్తులో మెరుగైన ఎంపిక కావచ్చని కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఘటనతో ఒకవైపు సోషల్ మీడియాలో వ్యంగ్యానికి దారితీస్తున్నప్పటికీ, మరోవైపు ఇంధన వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా చర్చ మొదలైంది. పెట్రోల్పై ఆధారపడే వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మారాల్సిన అవసరాన్ని కొందరు నెటిజెన్స్ ప్రస్తావిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం అత్యంత కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: CM Revanth Reddy: నా చేతికి అప్పుల రాష్ట్రాన్ని ఇచ్చారు
