Mumbai–Pune Expressway: ముంబై-పుణె ఎక్స్ ప్రెస్ హైవేపై వాహనదారులు నరకం చూశారు. దాదాపు 33గంటల పాటు అరిగోసపడ్డారు. గంటల తరబడి వాహనాలు ముందుకు కదలకపోవడంతో నానా అవస్థలు పడ్డారు. ఇంతకీ అసలు ఏం జరిగింది? ఎందుకు అన్ని గంటలు ట్రాఫిక్ జామ్ అయ్యిందంటే..?
ట్రాఫిక్ జామ్ కు అసలు కారణం ఇదే!
మంగళవారం సాయంత్రం ఖండాలా ఘాట్ సెక్షన్లో అతివేగంతో వెళ్తున్న ప్రొపిలీన్ గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదకరమైన, మండే స్వభావం గల గ్యాస్ కావడంతో అధికారులు భద్రతా కారణాల దృష్ట్యా రోడ్డును మూసివేశారు. బుధవారం రోజంతా ట్యాంకర్ లోని గ్యాస్ ను మరో వాహనంలోకి మార్చే ప్రక్రియ కొనసాగింది. దీనివల్ల హైవేపై సుమారు 22 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు నరకయాత న అనుభవించారు.
కారును వదిలేసి హెలికాఫ్టర్ లో వెళ్లిన సుధీర్ మెహతా
ప్రముఖ పారిశ్రామికవేత్త సుధీర్ మెహతా 8గంటల పాటు ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. ఆయన తన కారును అక్కడే వదిలేసి తిరిగి పుణె చేరుకోవడానికి హెలికాప్టర్ను ఆశ్రయించారు. గురువారం తెల్లవారుజాము నుంచి రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి.





