పోరాటాలు కొత్త రూపంలో పుట్టుకొస్తాయి
ప్రజలే చరిత్ర నిర్మాతలు
మాజీ మావోయిస్టు నేత బండి ప్రకాశ్
క్రైమ్ మిర్రర్, మంచిర్యాల: సమాజంలో అసమానతలు ఉన్నంత కాలం మార్క్సిజం , మావోయిజం, లెనినిజం ఉంటుందని తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు సింగరేణి కార్మిక సమాఖ్య(సికాసా) మాజీ కార్యదర్శి బండి ప్రకాశ్ తెలిపారు. దోపిడి, పీడనం ఉన్నంత కాలం మార్క్సిజం ఉంటుందని అవి ఎప్పుడు కనుమరుగవుతాయో వీటితో పని ఉండదని తెలిపారు.
విప్లవోద్యమంలో పని చేసినందుకు నాకు ఇప్పుడు ఈ పేరు వచ్చిందని లేకపోతే నేను ఒక బండి ప్రకాశ్గానే మిగిలిపోయేవాడినని తెలిపారు. నేను బతికున్నంత కాలం విప్లవోద్యమానికి రుణపడి ఉంటానని తెలిపారు. ఆదివారం స్థానిక సీఈఆర్ క్లబ్లో బండి ప్రకాశ్ మిత్రుల ఆధ్వర్యంలో నిర్వహించిన బండి ప్రకాశ్ దంపతులు, అప్పాచి నారాయణ దంపతుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ విప్లవోద్యమం అనేది భారత దేశం లోనే కాదని ప్రపంచ వ్యాప్తంగా ఉందని తెలిపారు. పార్టీ తీవ్రంగా నష్టపోయినప్పటికీ ప్రజల కోసమే పోరాటాలను కొత్త రూపంలో చేస్తుందని తెలిపారు. పార్టీ తీవ్రంగా పోయిందని అయినప్పటికీ కొత్త రూపాల్లో పని చేస్తుందని తెలిపారు. కొద్ది మంది మావోయిస్టులను ఎన్కౌంటర్లు చేసిన తరువాత ఆత్మసంతృప్తి చెందుతునా్నరని కాని విప్లవోద్యమం ఎప్పుడు అంతం కాదని అన్నారు.
ప్రాణాలుపోయేంత వరకు ప్రజా సమస్యలపైనే పోరాడుతానని ప్రజల కోసం ముందుంటానని తెలిపారు. అనారోగ్యంతోపార్టీకి భారం కాలేకనే ప్రజా జీవితంలోకి వచ్చానని తన మిత్రులంతా అండగా ఉండడాన్ని కొత్త అనుభూతి కలిగిందన్నారు. అప్పాచి నారాయణ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతోనే తాను ప్రజాజీవితంలోకి వచ్చానని తెలిపారు.
రాష్ట్ర కనీస సలహా మండలి చైర్మన్, ఐఎన్టీయుసీ సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో పద్దతులు మార్చారని చర్చలకు సిద్దమంటున్నప్పుడు పాలకవర్గాలు చర్చలు జరుపాల్సిన అవసరం ఉందని తెలిపారు. గతంలోదివంగత నేత రాజీవ్గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అస్సోంలో ప్రపల్లకుమార్ మహంతతో చర్చలు జరిపి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేశారని అదే విధంగా మిజోరంలో కూడ అక్కడ జరుగుతున్నటువంటి పోరాటలతో కూడ విరమింప చేసి ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చేశారన్నారు.
కాని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చర్చలకు వస్తామన్న పాశవికంగా దాడులు చేస్తూ చంపి వేస్తుందన్నారు. ఏదైన చర్చల ద్వరానే ఉద్యమాల ద్వరానే పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. ఈ విషయంపై కేంద్రం మరోసారి పునరాలోచించాలని కోరారు. మాజీ మంత్రి బోడ జనార్ధన్ మాట్లాడుతూ నమ్మిన సిద్దాంతం కోసం ప్రజల హక్కుల కోసం పోరాటాలు చేసిన బండి ప్రకాశ్, అప్పాచి నారాయణలకు సమాజంలో జరిగే సమస్యలపైనే ఎప్పుడు పోరాటాలు చేసిన తాము కూడ పోరాటాల్లో పాల్గొంటామని తెలిపారు.
నాలుగు దశబ్దాల పాటు విప్లవోద్యమంలో పని చేసి ప్రాణాలతో ప్రజాజీవితంలోకి రావడమనేది ప్రజల అండదండలతోనే సాధ్యమైందన్నారు. ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు మాట్లాడూత బండి ప్రకాశ్ తన క్లాస్మెంట్ అని పీడిత ప్రజల హక్కుల కోసం అటవి బాట పట్టాడని తెలిపారు. తాను ప్రభుత్వ విప్గా ఉన్న కాలంలో ఆయన సికాసా కార్యదర్శిగా ఉన్నారని ఎప్పుడు కూడ ఆయన నుంచి హెచ్చరికలు రావద్దని భయంతో పని చేసేవాడినని తెలిపారు.
తన మిత్రుడు బండి ప్రకాశ్, అప్పాచి నారాయణలకు సమాజం అండగా ఉంటుందని తెలిపారు. అదే విధంగా కార్మిక నేత కెంగర్ల మల్లయ్యతో పాటు కాంపెల్లి సమ్మయ్య, గురిజాల రవీందర్ రావు మాట్లాడుతూ ప్రజా జీవితంలోకి వచ్చిన ప్రకాశ్, నారాయణలకు తమవంతు సహకారం ఉంటుందని అన్నారు.
అంతకుముందు వీరిని డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా సీఈఆర్ క్లబ్ వరకు తీసుకొచ్చారు.వీరి ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు డప్పు కొడుతూ నృత్యం చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి హెచ్. రవీందర్ అధ్యక్షత వహించగా ఆయన మిత్రులు మేదరి సత్యనారాయణ, ఓ రాజశేఖర్, వాసాల శంకర్, నక్క వెంకట్రావు, ఏబూసి యాగయ్య తదితరులు పాల్గొన్నారు.
