Madras High Court: న్యాయస్థానాలు కొన్నిసార్లు చేసే వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తాయి. దేశ వ్యాప్తంగా చర్చకు కారణం అవుతాయి. తాజాగా మద్రాస్ హైకోర్టు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. “ప్రేమ వివాహం స్టాక్ మార్కెట్ లాంటిది, అందులో హెచ్చు తగ్గులుంటాయి” అంటూ మద్రాస్ హైకోర్టు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే..
తాజాగా తమ కుమార్తె కనిపించడం లేదంటూ తిరుచ్చికి చెందిన వ్యక్తి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది. ఆ యువతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైంది. తాను పశ్చిమ బెంగాల్ యువకుడిని వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నానని, తనను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని తెలిపింది.
ఎవరితో వెళ్లాలనేది ఆమె వ్యక్తిగతం!
ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు వారిని చదివిస్తారు. ప్రేమ వివాహం స్టాక్ మార్కెట్ లాంటిది. అందులో ఎత్తుపల్లాలుంటాయి. పిటిషనర్ కుమార్తె ఎవరితో వెళ్లాలనేది ఆమె వ్యక్తిగతం. అదే సమయంలో, తల్లిదండ్రుల భావాలను గౌరవించాల్సిన బాధ్యత పిల్లలపైనా ఉంది’’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.





