
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ :-
తెలంగాణలో త్వరలో టెట్రా ప్యాకెట్లలో మద్యం అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే కర్ణాటకలో ఈ తరహాలో మద్యం విక్రయిస్తున్నారు. ఫ్రూట్ జ్యూస్ తరహాలో మద్యం ప్యాకెట్లను 60 ఎంఎల్, 90 ఎంఎల్, 180 ఎంఎల్ ప్యాకెట్లను అమ్మేందుకు రెడీ అవుతున్నారు. సీసాల్లో దొరుకుతున్న మద్యం కంటే టెట్రా ప్యాకెట్ల ధర తక్కువగా ఉండనుంది. ప్రస్తుతం క్వార్టర్ చీప్ లిక్కర్ ధర రూ. 120గా ఉండగా, టెట్రా ప్యాకెట్లలో అది రూ. 100కే లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే టెట్రా ప్యాకెట్లలో మద్యం అందుబాటులోకి రానుంది.
కర్ణాటకలో మెక్డొవెల్స్ నంబర్ వన్ కంపెనీ 90 శాతం టెట్రా ప్యాకెట్లలోనే మద్యం విక్రయాలు జరుపుతోంది. రాష్ట్రంలోనూ అదే తరహాలో విక్రయానికి ముందుకొచ్చింది. ఇందుకోసం ఆ కంపెనీ ప్రతినిధులు రెండుసార్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులను కలిసి టెట్రా ప్యాకెట్ల వల్ల ఖర్చు తగ్గడంతోపాటు ప్రభుత్వానికి, వినియోగదారుడు, కంపెనీకి కలిగే ప్రయోజనాలను వివరించారు. టెట్రా ప్యాకెట్లపై ప్రజల్లో స్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకు తొలుత మహబూబ్నగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ టెట్రా ప్యాకెట్లను విక్రయించాలన్న చర్చ కూడా తెరపైకి వచ్చినట్టు తెలిసింది. కాగా, తెలంగాణలో మొత్తం 2,620 వైన్ షాపులు, 1,117 వరకు బార్లు ఉన్నాయి. వీటికి దేశ విదేశాలకు చెందిన 55 కంపెనీల ద్వారా మద్యం సరఫరా అవుతోంది.