తెలంగాణ

మునుగోడు నుంచి కోమటిరెడ్డి అవుట్.. నెక్స్ట్ పోటీ చేసేది అక్కడే!

కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవిష్యత్ అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆసక్తిగా మారింది. తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని భావించిన రాజగోపాల్ రెడ్డికి.. అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇంకా మిగిలి ఉన్న మూడు ఖాళీల్లోనూ కోమటిరెడ్డికి ఖచ్చితంగా వస్తుందనే ఆశ లేకుండా పోయింది. అన్న వెంకట్ రెడ్డిని పీకేస్తేనే తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అవకాశం ఉంటుందనే చర్చ గాంధీభవన్ లో సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నెక్స్ట్ ఏం చేయబోతున్నారన్న దానిపై కొత్త చర్చ తెరపైకి వస్తోంది.

ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి. వైఎస్సార్ ఆశిస్సులతో 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా గెలిచారు. రాష్ట్ర విభజనతో జరిగిన 2014 ఎన్నికల్లో మళ్లీ భువనగిరి ఎంపీగానే పోటీ చేసి.. బీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ చేతిలో ఓడిపోయారు. తర్వాత నల్గొండ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచారు. ఇక 2018లో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచి భారీ మెజార్టీతో గెలిచారు రాజగోపాల్ రెడ్డి. 2022లో బీజేపీలో చేరి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు మళ్లీ సొంతగూటికి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి.. మునుగోడు ఎమ్మెల్యేగా రెండోసారి విక్టరీ కొట్టారు.

వచ్చే ఎన్నికల్లో మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయకపోవచ్చని తెలుస్తోంది. ఆయన మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయించుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా ఆయన నెక్స్ట్ పోటీ చేయబోయే నియోజకవర్గ పరిధిలోని ఎక్కువగా తిరుగుతున్నారు. 2027లో దేశ వ్యాప్తంగా జనాభా లెక్కలు జరగనున్నాయి. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గలా డిలిమిటేషన్ జరగనుంది. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉంది. ఏపీలో 175 నుంచి 225కు.. తెలంగాణలో 119 నుంచి 153కు అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. ఈ ప్రక్రియ రాష్ట్ర విభజన కాగానే జరగాల్సి ఉన్నా.. జనాభా లెక్కలు కాకపోవడంతో ఆలస్యమైంది. 2027లో జనాభా లెక్కలు ఉన్నందున.. ఆ వెంటనే అసెంబ్లీ సీట్ల పెంపు ఉండనుంది. 2028లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 153 సీట్లకు జరగనున్నాయి.

విభజన చట్టం, రాష్ట్ర జనాభా ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు నుంచి నాలుగు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు రానున్నాయి. భువనగిరి పార్లమెంట్ పరిధిలో చౌటుప్పల్ కొత్త నియోజకవర్గంగా ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో ఉన్న చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాలతో పాటు భువనగిరి అసెంబ్లీ పరిధిలోని పోచంపల్లి, నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట, చిట్యాల మండలాలతో కలిసి కొత్త నియోజకవర్గం ఉంటుందని తెలుస్తోంది. ఈ మండలాలలో కలిసి చౌటుప్పల్ నియోజకవర్గం ఉండేలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన మునుగోడును వదిలేసి చౌటుప్పల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఈ ఐదు మండలాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. రాజగోపాల్ రెడ్డికి బలమైన అనుచరగణం ఉంది. చౌటుప్పల్ నుంచి కోమటిరెడ్డి పోటీ చేస్తే.. ఆయన తిరుగే ఉండదనే టాక్ కూడా వస్తోంది. అందుకే కొన్ని రోజులుగా చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాలపైనే రాజగోపాల్ రెడ్డి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button