కర్ణాటకలోని చంద్రద్రోణ హిల్స్ దగ్గర జరిగిన విషాదకర ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కేరళకు చెందిన 14 ఏళ్ల బాలిక శ్రీనంద ట్రెక్కింగ్కు వెళ్లి కనిపించకుండా పోయి, నాలుగు రోజుల తర్వాత మృతదేహంగా బయటపడింది. ఈ ఘటన కుటుంబ సభ్యులను మాత్రమే కాకుండా అందరినీ షాక్కు గురిచేసింది.
ఇంతకీ అసలు ఏం జరిగింది?
పాలక్కాడ్ ప్రాంతానికి చెందిన శ్రీనంద పదో తరగతి చదువుతోంది. ఇటీవల ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటకకు పర్యటనకు వెళ్లింది. సుమారు 40 మంది బంధువులతో కలిసి మొదట హంపీని సందర్శించిన వారు, అక్కడి నుంచి ఏప్రిల్ 7న చిక్కమంగళూరు చేరుకున్నారు. అదే రోజు మధ్యాహ్నం చంద్రద్రోణ హిల్స్లో ట్రెక్కింగ్కు వెళ్లారు. సాయంత్రం వరకు అంతా సాధారణంగానే ఉన్నప్పటికీ, చీకటి పడే సమయానికి శ్రీనంద కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. చివరిసారిగా ఆమెను మాణిక్యధార ప్రాంతంలో చూసినట్లు తెలిపారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి సెర్చింగ్ ఆపరేషన్ ప్రారంభించారు.
ఎన్నో అనుమానాలు!
బాలిక తల్లిదండ్రులు తమ కూతురిని ఎవరైనా అపహరించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు, కొందరు ఆమె ఎవరితోనైనా వెళ్లి ఉండవచ్చని కూడా భావించారు. ఈ విషయంపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర, బాలిక ఎక్కడ ఉందో తెలియకపోతే అసలు విషయం చెప్పలేమని వ్యాఖ్యానించారు. శ్రీనంద కోసం అధికారులు గాలింపు చేపట్టారు. డ్రోన్లు, థర్మల్ కెమెరాలు వంటి ఆధునిక పరికరాలను ఉపయోగించి కొండ ప్రాంతమంతా గాలించారు. అయితే నాలుగు రోజుల తర్వాత బ్యాడ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. మాణిక్యధార వ్యూపాయింట్ సమీపంలో సుమారు 1500 అడుగుల లోతులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.
పోలీసులు వెంటనే శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. మరణానికి గల కారణాలపై స్పష్టత రావడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, కేసు దర్యాప్తులో భాగంగా బాలిక తల్లిదండ్రుల ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులందరిని ప్రశ్నిస్తూ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
