
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటినుండీ కాపాడుకుంటూ వస్తున్న బిఆర్ఎస్ పార్టీయే తెలంగాణ సమాజానికి రక్షణ కవచం అని, ఈ విషయం గత పద్నాలుగు నెల్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి స్పష్టమైందని,, అందుకు తెలంగాణ సమాజంలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి అనిశ్చితే నిదర్శనమని బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు.
బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భవించి 27 ఏప్రిల్ తేదీకి 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో నిర్వహించే రజతోత్సవ వేడుకల్లో భాగంగా.. వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు.
ఈమేరకు వరంగల్ సమీపంలో విశాలమైన అనువైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభా వేదిక స్థలాన్ని నిర్ణయించనున్నట్టు కేసీఆర్ తెలిపారు.ఈ మేరకు ఎర్రవెల్లి నివాసంలో శుక్రవారం నాడు జరిగిన కీలక సమావేశంలో ఇందుకు సంబంధించి సుధీర్ఘ చర్చ జరిగింది.
దశాబ్దాల పాటు పోరాటాలు నడిపి ఎన్నో త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని, అనంతరం పదేండ్ల పాటు ఎంతో అప్రమత్తతో తెలంగాణ స్వరాష్ట్రంలో పాలనను దేశానికే ఆదర్శంగా నిలుపుకున్నామని, అంతటి గొప్ప ప్రగతిని సాధించిన తెలంగాణ సమాజం ఇవ్వాల కష్టాల్లో వుందన్నారు కేసీఆర్. ఇటువంటి సందర్భంలో నిర్వహించుకుంటున్న రజతోత్సవ వేడుకలు, కేవలం బి ఆర్ ఎస్ పార్టీకే పరిమితం కాదని యావత్ తెలంగాణ సమాజానికి అందులో భాగస్వామ్యం వుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఆశపెట్టిన గ్యారెంటీలను వాగ్దానాలను నమ్మిన ప్రజలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారని, ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బి ఆర్ ఎస్ కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ అన్నారు.వరంగల్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారని సమావేశంలో ఆశాభావం వ్యక్తమైంది.బహిరంగ సభ సన్నాహక సమావేశాలను నియోజక వర్గాల వారీగా నిర్వహించాలని అందుకు త్వరలో కమిటీలను వేయనున్నట్టు కేసీఆర్ తెలిపారు.
వరంగల్ బహిరంగ సభ అనంతరం…పార్టీనీ గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పటిష్ట పరిచి , ఆ దిశగా కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆ తర్వాత… నూతన కమిటీల బాధ్యులతో… ప్రతినిధుల సభను ఏర్పాటు చేయనున్నట్టు అధినేత తెలిపారు.కాగా….పార్టీలో యువత, మహిళా భాగస్వామ్యం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం తో పాటు, దేశంలో నడుస్తున్న వర్తమాన రాజకీయ పరిస్థితులపై సమావేశంలో సుధీర్ఘ చర్చ జరిగింది.అందుకనుగుణంగా పార్టీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలు అమలుచేయాల్సిన రాజకీయ ఎత్తుగడల పై లోతైన చర్చ జరిగింది.
గత ఒడిదుడుకులను అనుభవాలను పరిగణలోకి తీసుకుని వాటిని విశ్లేషిస్తూ, వర్తమానానికి అన్వయించుకుంటూ భవిష్యత్తు కు బాటలువేసుకునే విధంగా కార్యాచరణను అమలు పరచాలని సమావేశంలో నిర్ణయించారు.కేంద్రం లో ఏపార్టీ ప్రభుత్వమున్నకూడా ,తెలంగాణ సమాజానికి మొదటినుంచీ అవి వ్యతిరేకంగానే పని చేస్తున్నాయని సమావేశంలో ఆవేదన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం లో పార్టీ నీ పటిష్టం చేసుకొని దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల నిత్యం అప్రమత్తత తో వుండాలని సమావేశం భావించింది. తెలంగాణ ఇంటి పార్టీ ప్రాతినిథ్యం పార్లమెంటులో లేకపోవడం వలన తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతుందని అంశం పై చర్చ జరిగింది. ఇదే విషయాన్ని ప్రజలకు మరింతగా అర్ధం చేయించి పార్లమెంటులో బి ఆర్ ఎస్ ఎంపీ లు ప్రాతినిథ్యం వుండి రాష్ట్ర హక్కులను కాపాడుకునే దిశగా ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాలని సమావేశంలో నిర్ణయించారు.
కాగా పలు అంశాలపై చర్చ సంధర్బంగా అధినేత అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న నేతలు వారి వారి అభిప్రాయాలను అధినేత ముందుంచారు.దాదాపు ఎనిమిది గంటల పాటు సాగిన సుధీర్ఘ చర్చలో.. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరులను తిప్పి కొడుతూ తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ అధ్యక్షతన సాగిన సమావేశం నిర్ణయించింది.