
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :- మొన్నటి వరకు అన్న కేటీఆర్ను టార్గెట్ చేసిన కవిత.. ఇప్పుడు ఆయన తరపున వకాల్తా పుచ్చుకుంది. అది చూసి.. అందరూ నోరెళ్లబెడుతున్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య అసలు ఏం జరుగుతోందని… చెవులు కొరుక్కుకుంటున్నారా..? ఇంతకీ కేటీఆర్-కవిత మధ్య రాజీ కుదిరిందా..! లేదా కవితే రూటు మార్చిందా…! అసలు ఏం జరుగుతోంది…? అంటూ మరో చర్చ మొదలైంది.
బీఆర్ఎస్లోని లోపాలను ఎత్తిచూపుతూ డియర్ డాడీ… అంటూ కేసీఆర్కు కవిత రాసిన లేఖ రాజకీయాల్లో ఒక సంచలనం. ఆ లేఖ ఎలా బయటపడింది…? ఎవరు బయటపెట్టారో…? ఇప్పటివరకు తెలియదు కానీ… ఆ లేఖ ద్వారా.. కల్వకుంట్ల కుటుబంలో అన్నాచెల్లెళ్ల మధ్య ఆధిపత్య పోరు బయటపడింది. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ.. కవిత చేసిన కామెంట్స్ అయితే… కొన్ని రోజుల పాటు చర్చకు దారితీశాయి. ఆ తర్వాత.. ఆమె తెలంగాణ జాగృతి పేరుతో కొత్త కార్యాలయం ప్రారంభించడం… ఆ కార్యక్రమంలో గులాబీ జెండాలు కనిపించకపోవడంతో… ఆమె సొంత కుంపటి పెట్టకనే పెట్టేసుకుందని తేలిపోయింది. అంతేకాదు.. తెలంగాణ జాగృతి పేరుతో చేపట్టిన ధర్నాకు కూడా బీఆర్ఎస్ శ్రేణులు, గులాబీ జెండాలు కనిపించలేదు. దీంతో… కవితది వేరు కుంపటే అని ఫిక్సయిపోయారు. పైగా… కేటీఆర్ హరీష్రావు ఇంటికి వెళ్లడం.. గంటల పాటు చర్చలు జరపడంతో.. అందరూ ఒకవైపు.. కవిత మరోవైపు అన్న చర్చ కూడా జరిగింది.
కట్ చేస్తే… కేసీఆర్ కాళేశ్వరం విచారణకు బయలుదేరే రోజు భర్తతో కలిసి ఎర్రవెల్లి ఫామ్హౌస్కు వెళ్లారు కవిత. తండ్రితో మాట్లాడాలని ట్రై చేశారట. కానీ… ఆయన దగ్గరకు రానివ్వలేదని.. ఆమె వైపు చూడలేదని సమాచారం. అంతేకాదు.. కేటీఆర్ కూడా కవితను పట్టించుకోలేదని సమాచారం. దీంతో.. కవితకు తన పరిస్థితి అర్థమైందని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. తండ్రి, అన్న విభేదిస్తే… రాజకీయంగా మనుగడ ఉండదన్న ఆలోచన కవితలో కలిగిందట. అందుకే.. ఆమె రూట్ మార్చిందని.. అన్నతో సఖ్యంగా ఉండాలని ప్రయత్నిస్తోంది … కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇవ్వడాన్ని ఖండించిందని భావిస్తున్నారు. అంతేకాదు.. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఆమె అనడం కూడా ఇందుకు నిదర్శమని అంటున్నారు. అంటే.. కేటీఆర్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని కవిత ఒప్పుకున్నట్టే అని చెప్తున్నారు.
మరో వాదన ఏంటంటే… కేసీఆర్కు కాళేశ్వరం నోటీసులపై స్పందించిన కవిత.. కేటీఆర్కు ఏసీబీ నోటీసులపై రియాక్ట్ కాకపోతే బాగోదని భావించినట్టు సమాచారం. తానకు ఎవరితోనూ విభేదాలు లేవని.. బీఆర్ఎస్లో ప్రస్తుతం పోరాటపటిమ తగ్గిందని… తెలంగాణ జాగృతితో రాష్ట్ర ప్రయోజనాలు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలని ఆమె అనుకుంటున్నారట. అందుకే… గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్వహించిన ఫార్ములా ఈ-కారు రేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇవ్వడాన్ని కవిత ఖండించారని అంటున్నారు.