Parameshwara On CM Post: కర్ణాటక సీఎం రేసులో తానూ ఉన్నానని హోంమంత్రి పరమేశ్వర్ ప్రకటించారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎప్పటి నుంచో సీఎం రేసులో ఉన్నానని చెప్పుకొచ్చారు. దళిత నేత సీఎం కావాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉందని గుర్తు చేశారు.
2023లో సీఎం ఎంపిక సందర్భంగా రెండున్నరేళ్ల తర్వాత మార్పు అన్న అంశం చర్చకు రాలేదన్నారు. మధ్యలో అధిష్ఠానం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని, అధిష్ఠానం అన్నింటినీ పరిశీలిస్తుందని చెప్పారు. గతంలో బంగారప్పను మార్చి వీరప్ప మొయిలీని చేయలేదా? అని ప్రశ్నించారు. అయితే, ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉందని తాను భావించడం లేదన్నారు. రాహుల్గాంధీ విదేశాల నుంచి వచ్చాక చర్చలు జరగవచ్చన్నారు.
కన్నడ రాజకీయాలను గమనిస్తున్నామన్న ఖర్గే
అటు కన్నడ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వెల్లడించారు. ఈ విషయంపై తాను ప్రస్తుతం ఏమీ చెప్పనని, దీనిపై అధిష్ఠానం త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. అధిష్ఠానం నిర్ణయాన్ని తనతోపాటు డీకే శివకుమార్ సహా అందరూ అంగీకరించాల్సిదేనన్నారు.
అటు, అధికార పోరాటంలో అధిష్ఠానం జాప్యం చేస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిద్దరామయ్య, శివకుమార్ గ్రూపులు సహా ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ లో నాలుగు గ్రూపులు ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరుతున్నాయి. అధిష్థానం జాప్యం చేస్తే పార్టీకి నష్టం తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఫారిన్ వెకేషన్ లో ఉన్న రాహుల్ ఇండియాకు రాగానే కర్నాటక రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.





