
Tihar Jail: ఆర్థిక మోసాలకు పాల్పడి లండన్ లో తలదాచుకుంటున్న నీరవ్ మోడీ, విజయ్ మాల్యాను ఇండియాకు తీసుకురానున్నారా? వారిని తీహార్ జైలులో ఉంచనున్నారా? అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దానికి కారణం బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ ప్రతినిధుల బృందం ఇటీవల న్యూఢిల్లీలోని తీహార్ జైలు పరిశీలించింది. ఆర్థిక, క్రిమినల్ నేరారోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయి బ్రిటన్లో తలదాచుకుంటున్న వారిని స్వదేశానికి రప్పించేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో యూకే అధికారులు ఈ జైలును పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ బ్రిటన్ లో తలదాచుకుంటున్నారు. రీసెంట్ గా తీహార్ జైలులోని హై సెక్యూరిటీ వార్డును సీపీఎస్ బృందం ఇటీవల పరిశీలించి ఆ వార్డులో ఉంటున్న కొందరు ఖైదీలతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ ఫ్యుజిటివ్స్ ను వెనక్కి తీసుకువచ్చినప్పుడు వారి భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని, అవసరమైతే జైలులోనే స్పెషల్ ఎన్క్లేప్ ఏర్పాటు స్తామని జైలు అధికారులు వారికి వివరించినట్టు తెలుస్తోంది.
నీరవ్, మాల్యాను అప్పగించాలని కోరుతున్న భారత్
దేశం నుంచి పారిపోయి విదేశాల్లో ఉంటున్న వారిని అప్పగించాలని భారత్ యూకే కోర్టులను చాలాకాలంగా కోరుతోంది. ఇండియాలో జైళ్ల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ బ్రిటన్ కోర్టులు పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో నిందితులు కస్టడీలో ఉన్నప్పుడు ఎలాంటి ఇల్లీగల్ ఇంటరాగేషన్ జరగదని భారత్ గట్టి హామీనిచ్చింది. ప్రస్తుతం దేశం నుంచి పారిపోయి విదేశాల్లో ఉంటున్న 178 మంది అప్పగింతపై భారత్ అభ్యర్థనలు ఉన్నాయి. వీటిలో సుమారు 20 యూకేలో ఉన్నాయి. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, సంజయ్ భండారీ తదితరులతో పాటు ఆయుధ డీలర్లు , ఖలిస్థాన్ గ్రూప్ తో సంబంధాలున్న వ్యక్తుల పేర్లు కూడా ఉన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.9,000 కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టారనే ఆరోపణలను విజయ్ మాల్యా ఎదుర్కొంటుండగా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ రూ.13,800 కోట్ల పంజాబ్ బ్యాంక్ ఫ్రాడ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, త్వరలో వీరిద్దరితో పాటు మరికొందరు ఇండియాకు వచ్చే అవకాశం ఉంది.