భారత ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పదవీకాలం ముగియడంతో.. ఆయన స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ సీజేఐగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. జస్టిస్ సూర్యకాంత్ భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఇవాళ ప్రమాణం చేయనున్నారు. జస్టిస్ సూర్యకాంత్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు.
తొలిసారి విదేశీ అతిధుల రాక
రాష్ట్రపతి భవన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఆరు దేశాల ప్రధాన న్యాయమూర్తులు సీజేఐ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. భూటాన్, కెన్యా, మలేసియా, మారిషస్, నేపాల్, శ్రీలంక దేశాల చీఫ్ జస్టి్సలు వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొననున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశీ అతిథులు రావడం ఇదే తొలిసారి. జస్టిస్ సూర్యకాంత్ సుమారు 15 నెలల పాటు సీజేఐ పదవిలో ఉంటారు. 2027 ఫిబ్రవరి 9న ఆయన పదవీ విరమణ చేస్తారు. సీజేఐ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు.
హర్యానా నుంచి తొలి సీజేఐ..
జస్టిస్ సూర్యకాంత్ సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వ్యక్తిగా నిలవనున్నారు. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హిసార్ లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అలాగే, 2024 నవంబరు 12 నుంచి సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్ గా పనిచేస్తున్నారు.





