
వల్లభనేని వంశీ జైల్లోకి వెళ్లి కొన్ని నెలలైంది. బయటకు వచ్చే దారి కనిపించడం లేదు. ఆరోగ్యం బాగోలేదు మొర్రో అంటున్నా.. పట్టించుకునే నాధుడే లేడు. ఇప్పుడు కాకాణిది కూడా అదే పరిస్థితా..? జైల్లోకి వెళ్లడమే గానీ… ఇప్పట్లో బయటకు వచ్చే మార్గమే ఉండదా..? అంటే దాదాపుగా అంతేకావొచ్చు. ఎందుకంటే కాకాణిపై పెట్టిన కేసులు అలాంటివి.
కాకాణి గోవర్ధన్రెడ్డి.. వైసీపీ హయాంలో నెల్లూరు చక్రం తిప్పారు. కూటమి ప్రభుత్వం రాగానే… కేసులతో కాలం గడపాల్సి వస్తోంది. కాకాణిపై.. క్వార్ట్జ్ అక్రమాలు, భారీ పేలుళ్ల పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసు.. ఇలా చాలా కేసులు ఉన్నాయి. రూల్స్ను అతిక్రమించి పేలుడు పదార్థాలు వాడారని కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో ప్రశ్నించిన గిరిజనులను బెదిరించారన్న కేసు కూడా ఉంది ఆయనపై. ఇప్పటి ఈ కేసులు ఉన్నా… ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. వంశీ విషయంలో పాతకేసులను, క్లోజ్ అయిన కేసులను కూడా తిరగతోడారు పోలీసులు. ఇప్పుడు కాకాణి విషయంలోనూ అలాగే చేయరని ఏమీ లేదు.
క్వార్ట్జ్ అక్రమాలపై కేసు నమోదవగానే… అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు కాకాణి. కేసులకు భయపడనని అంటూనే.. అదృశ్యమయ్యారు. విచారణకు రావాలంటూ కాకాణి మూడు సార్లు నోటీసులు ఇచ్చారు పోలీసులు. కాకాణి లేకపోవడంతో… రెండు నోటీసులను ఆయన ఇంటికి అంటించారు. మూడో నోటీసులను కాకాణి బంధువులకు ఇచ్చారు. కాకాణి ఎక్కడ ఉన్నారో చెప్పాలని స్టేషన్కు పిలిపించుకుని అడిగారు. అయినా కాకాణి జాడ లేదు. రెండు నెలలు అజ్ఞాతంతోనే గడిపేశారాయన. కాకాణి బెంగళూరు శివారులోని ఓ రిసార్ట్లో ఉన్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో.. ఆదివారం రాత్రి అక్కడకి వెళ్లి అరెస్ట్ చేశారు. సోమవారం (మే 26) ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు కాకాణి.
ప్రస్తుతానికి… కోర్టు 14 రోజుల రిమాండ్ మాత్రమే విధిచింది. కానీ.. ఆ రిమాండ్ పెరుగుతూ పోతుంది. వంశీ విషయంలో జరిగినట్టే.. కాకాణి కూడా కొన్ని నెలల వరకు బయటకు రానన్న ప్రచారం జరుగుతోంది. కాకాణి అరెస్ట్ను వైసీపీ ఖండించింది. వైసీపీ నేతలను టార్గెట్ చేసి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.