
Iran-Israel War: మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలను పరిష్కరించేందుకు తమ వంతు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత్ ప్రకటించింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణలో అమెరికా ముఖ్యపాత్ర పోషించినట్లు వచ్చిన వార్తలను ఆహ్వానించింది. భారత్ కూడా శాంతిస్థాపన కోసం ప్రయత్నిస్తుందని విదేశాంగశాఖ ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగశాఖ కార్యదర్శి రణ్ ధీర్ జైశ్వాల్ ప్రకటించారు. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు, ఘర్షణలు పరిష్కారం కావడానికి చర్చలు, దౌత్య మార్గాలు మినహా మరో ప్రత్యామ్నాయం లేదన్నారు.
మరో 281 మందితో ఢిల్లీకి చేరిన విమానం
అటు యుద్ధం కారణంగా ఇరాన్ లో చిక్కుకుపోయిన మరో 281 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చినట్లు విదేశాంగ కార్యదర్శి రణ్ ధీర్ తెలిపారు. వీరిలో ముగ్గురు శ్రీలంక వాసులు, ఇద్దరు నేపాల్ వాసులు ఉన్నట్లు వెల్లడించారు. ఆపరేషన్ సింధు పేరిట ఇప్పటి వరకు 2,576 మందిని ఇరాన్ నుంచి భారత్ కు తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు.
ఇరుగు పొరుగు దేశాలకూ సాయం
అటు ఆపద సమయంలో ఇరుగు పొరుగు దేశాలకు కూడా సాయం అందించేందుకు భారత్ ముందుంటుందని విదేశాంగశాఖ సహాయమంత్రి పవిత్ర మార్గెరిటా తెలిపారు. ఆపరేషన్ సింధూలో భాగంగా పక్క దేశాలు అయిన నేపాల్, శ్రీలంకు కూడా సాయం చేసినట్లు వెల్లడించారు. ఇరాన్ నుంచి ఇప్పటి వరకు 11 దఫాలుగా 2,576 మందిని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇజ్రాయెల్ నుంచి 594 మందిని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. మొత్తంగా ఆపరేషన్ సింధు పేరుతో ఇరు దేశాల నుంచి 3,180 మంది భారతీయలను సురక్షితంగా తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పొరుగు దేశాలకు చెందిన పౌరులను కూడా తీసుకొచ్చినట్లు మార్గెరిటా వెల్లడించారు.
Read Also: శత్రువును మోకాళ్లపై కూర్చోబెట్టాం, ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు!