
ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులు చూపుతున్న అవ్యవస్థితి – ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని దిగజారేలా చేస్తోంది. నిజమైన అర్హులకు గూడు అందే దాకా ఈ కథనం ముగియదు.
నల్లగొండ, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇండ్లు పథకం – ఇప్పుడు వివాదాల వేదికగా మారుతోంది. నిజమైన పేదవారికి గూడు కట్టాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం, అధికార పార్టీ నేతల జోక్యంతో గందరగోళ భరితంగా మారినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇండ్లు, భూములు, ఇతర ఆస్తులు కలిగిన వారికి సైతం ఇంటి పట్టాలు మంజూరు కావడం… పట్టాలు పంపిణీలో అర్హులకంటే అధికంగా అనర్హులకే మునుగోడు నియోజకవర్గంలో ప్రాధాన్యతనివ్వడం విమర్శలకు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతల అస్తవ్యస్త వ్యవహారశైలి వల్లే ఈ అవకతవకలన్నీ జరిగాయని స్థానికంగా గుసగుసలు.
పట్టాల పంపిణీ అంశంలోనే కాక, అర్హుల జాబితా ఎవరితో తయారవుతోంది? ఎవరి ఆధారాలు ఆధారంగా ఎంపికలు జరుగుతున్నాయి? అన్నదానిపై ఇప్పటికీ ప్రభుత్వ అధికారులు ఓ స్పష్టత ఇవ్వలేకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ వ్యవహారంపై బహిరంగంగా మాట్లాడి, “దొంగలకే ఇండ్లు మంజూరు అయ్యాయి. మా నాయకుల వల్లే తప్పు జరిగింది,” అని చెప్పడమే కాక, తన పార్టీ నేతలపైనే పెదవి విరిచారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
చదరంగంలో అధికారులే పావులు? : స్థానిక నాయకుల ఆధీనంలో ప్రభుత్వ అధికారులు పని చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. “మా వద్ద జాబితా లేదు” అంటూ బుకాయింపు చెప్పే అధికారులు, పట్టాలు పంపిన తర్వాత కూడా అదే మాట చెబుతుండడం దృష్టి ఆకర్షిస్తోంది. పారదర్శకత కోసం నాన్తించే ప్రభుత్వం, ఎందుకు లబ్దిదారుల జాబితాను బయటపెట్టడంలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
చర్చలకు దారితీస్తున్న పట్టాల వివాదం : పట్టాలు మంజూరైనవారి పేర్లు పరిశీలిస్తే, చాలా మంది ఇప్పటికే ఇండ్లు కలిగి ఉన్నవారుగా గుర్తించారని సమాచారం. నిజమైన పేదవారు మాత్రం పట్టాలు రావలసిన ప్రతీసారి నిరాశలో మిగిలిపోతున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. “ప్రజా పాలన పేరుతో మమల్ని మోసం చేస్తున్నారు” అని పలువురు అర్హులుగా చెప్పుకునే వ్యక్తులు విమర్శిస్తున్నారు.