- టీ-20 వరల్డ్ కప్ లో టీమిండియా జోరు
- దాయాది దేశం పాక్ ను చిత్తు చేసిన భారత్
- బ్యాటింగ్, బౌలింగ్ లో దూకుడు
- 61 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ
టీ-20 ప్రపంచ కప్లో టీమిండియా మరో విక్టరీ కొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై అద్భుత విజయాన్ని సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్లోనూ మెరిసి పాకిస్థాన్ను చిత్తు చేసింది. ఈ విజయంతో టీమిండియా సూపర్ 8కి క్వాలిఫై అయ్యింది. టీ-20 ప్రపంచ కప్లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ జరిగింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 114 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు సమష్టిగా రాణించి పాక్ను స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు.
బ్యాటింగ్ తో దుమ్మురేపిన భారత్
టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్కు అనుకూలించిన స్లో పిచ్పై ఆరంభంలోనే టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులతో పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పది ఫోర్లు, మూడు సిక్స్ లతో పరుగుల వరద పారించాడు. అయుబ్ బౌలింగ్లో ఇషాన్ అవుటైన తర్వాత పరుగుల వేగం కాస్త నెమ్మదించింది. ఆ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32), తిలక్ వర్మ (25) ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. సూర్య మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో దూబె (27) వేగంగా ఆడాడు.చివరకు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది.
114 పరుగులకే పాక్ ఆలౌట్
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఆరంభంలోనే టాపార్డర్ వికెట్లు కోల్పోయింది. ఉస్మాన్ కాసేపు క్రీజ్ లో నిలబడ్డాడు. కానీ, అతడికి ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో పాక్ ఏ దశలోనూ టార్గెట్ను ఛేదించేలా కనిపించలేదు. చివరకు 18 ఓవర్లలో 114 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అక్షర్, బుమ్రా, వరుణ్, హార్దిక్ రెండేసి వికెట్లు పడగొట్టారు. తిలక్, కుల్దీప్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. కాగా, టీ-20 ప్రపంచకప్లలో పాక్పై భారత్కు ఇది ఎనిమిదో విజయం. పాక్ మాత్రం ఇప్పటికి ఒక్కసారే గెలుపొందింది.
Read Also: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్.. బలాలు, బలహీనతలు ఇవే?
