
భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించిందని భారత బలగాలు చెబుతున్నాయి. దీనికి భారత సైన్యం ధీటుగా బదులిస్తోంది. దీంతో కాల్సుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ ఉల్లంఘించినట్లైంది.
పహల్గామ్ ఉగ్రదాడితో ఏ క్షణమైనా భారత్ తమపై దాడిచేయొచ్చని భావిస్తోన్న పాకిస్థాన్.. సరిహద్దుల్లో తన బలగాలను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యాలు నేటి తెల్లవారుజామున భారత పోస్ట్లపై కాల్పులకు తెగబడ్డాయి. పాక్ చర్యలకు భారత సైన్యం గట్టిగానే బదులిస్తోంది. పాకిస్థాన్ సైన్యం కాల్పులను భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికార వర్గాలు తెలిపాయి. పహల్గామ్లో పర్యాటకులపై దాడి రెండు దేశాల మధ్య కొత్త సంక్షోభానికి దారితీసిన తరుణంలో ఈ కాల్పులు జరిగాయి.
కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుతూ పాక్ సైన్యం బరితెగించడంతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. పహల్గామ్ ఘటనతో అప్రమత్తమైన పాకిస్థాన్ మిలిటరీ.. తమ యుద్ధ విమానాలను కరాచీ నుంచి ఉత్తరాన ఉన్న వైమానిక స్థావరాలకు పంపించినట్లు వార్తలు వచ్చాయి. జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ దేశంతో సింధు జలాల ఒప్పందం తాత్కాలిక రద్దు సహా దౌత్యపరమైన ఆంక్షలు విధించింది. దీనికి పాకిస్థాన్ ప్రతీకారంగా భారత్కు చెందిన విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, సిమ్లా ఒప్పందం నుంచి వైదొలగినట్టు ప్రకటన చేసింది.
భారత్ తీసుకున్న దౌత్య నిర్ణయాల నేపథ్యంలో పాక్ జాతీయ భద్రతా వ్యవహారాల కమిటీ కొన్ని గంటల పాటు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. పలువురు పాక్ మంత్రులు, పాక్ త్రివిధ దళాలకు చెందిన చీఫ్లు పాల్గొని.. దాదాపు భారత్ నిర్ణయాలనే కాపీ కొట్టింది. పాకిస్థాన్లో సార్క్ వీసా మినహాయింపు స్కీమ్ ద్వారా పర్యటిస్తున్న భారతీయులకు అనుమతులు, ఇతర వీసాలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ కార్యాలయంలోని భారత దౌత్య సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించింది.
అట్టారీ బోర్డర్ను మూసివేయాలని భారత్ నిర్ణయించగా.. దానికి ప్రతిగా వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. ఇక 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో తమ గగనతలంలోకి భారత్కు చెందిన విమానాలు గానీ, భారతీయ సంస్థలు నడుపుతున్న విమానాలు గానీ ప్రయాణించకుండా నిషేధం విధించినట్టు తెలిపింది. అంతేకాదు, భారత్తో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలని పాకిస్థాన్ భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.