
ఆపరేషన్ సిందూర్పై ఇన్నాళ్లూ బుకాయించిన పాకిస్తాన్….ఎట్టకేలకు తమపై భారత్ చేసిన దాడిని అంగీకరించింది. అసలు నిజాలను వెల్లడించింది. నూర్ ఖాన్, ఇతర వైమానిక స్థావరాలపై దాడి జరిగిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. దాడుల విషయం తెల్లవారుజామున రెండున్నర గంటలకు ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ వివరించారని వెల్లడించారు. ఆ టైంలో తమ వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం, చైనీస్ యుద్ధ విమానాలను వినియోగించిందని షరీఫ్ పేర్కొన్నారు. ఇదే టైంలో భారత్, పాకిస్తాన్లు కశ్మీర్ సహా తమ మధ్య విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటికి మూడు సార్లు యుద్ధం జరిగినా వచ్చిందేమీ లేదు అంటూ సరికొత్త వ్యాఖ్యలు చేశారు.
మరో 24 గంటల్లో భారత్ పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ముగుస్తుంది. ఈ నేపధ్యంలో మే 19న ఇరు దేశాల DGMOలు మరోసారి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే కాల్పుల విరమణ పొడిగింపు వుండనుంది. తొలిసారి జరిగిన చర్చల్లో భారత్ ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించినట్టు సమాచారం. మొదటిది పాకిస్తాన్ లోని ఉగ్రవాదంపై ఆదేశం ఉక్కుపాదం మోపాలని, రెండవది ఆదేశంలో తల దాచుకున్న హఫీజ్ సయీద్, మసూద్ అజర్ తో పాటు మరికొంత మంది తీవ్రవాదులను భారత్కు అప్పగించాలని కోరింది, ఇక మూడవది పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్కు అప్పగించాలని బిమాండ్ చేసింది. అయితే పాకిస్తాన్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. భారత్ క్షిపణ దాడుల్లో దెబ్బతిన్న మసూద్ అజర్కు నష్ట పరిహారం , ఆర్థిక సాయం ప్రకటించడంపై భారత్ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ కొనసాగింపులో భాగంగా పాకిస్తాన్పై మరో సారి దాడి చేసే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.