-
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
-
తెలంగాణకు వాతావరణ హెచ్చరిక
-
పలు జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దానికి తోడు బెంగాల్ నుంచి తూర్పు కోస్తాంధ్ర వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని అన్నారు. ప్రస్తుతం అల్పపీడనం బలహీనపడిందని, ఇవాళ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి, జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ మేరకు ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రానున్న గంటల్లో వర్షం వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీ కంటే తక్కువగా తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇక జనగాం, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి, జిల్లాలలోనూ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రానున్న 2-3 గంటల్లో తేలికపాటి వర్షం, గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీ కంటే తక్కువగా వీచే ఛాన్స్ ఉందని చెప్పారు.
పలు జిల్లాల్లో పంటనష్టం
అకాల వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పంటనష్టం కలిగింది. ఈదురు గాలులతో కూడిన వర్షాల కారణంగా పలు పంటలకు, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లా చందంపేటలో 6.3 సెం.మీ. వర్షం కురిసింది. గుండ్లపల్లిలోనూ భారీ వాన కురిసింది. సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వానలు కురిశాయి. హైదరాబాద్ నగరంలోనూ సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో జోరు వర్షం పడింది. ఇదే వాతావరణం మరో రెండు రోజులు ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

