జాతీయం

జూన్ 14 వరకు భారీ వర్షాలు, తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?

IMD Issues Alert: దేశ వ్యాప్తంగా వాతావరణం మారుతోంది. ఓ వైపు ఎండలు మండుతుండగా, మరోవైపు వానలు కురుస్తాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ(IMD) కీలక ప్రకటన విడుదల చేసింది. వచ్చే వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో రుతుపవనాలు యాక్టివ్ గా ఉన్నాయి. జూన్ 11 నుంచి 14 వరకు అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అటు నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరాంలో జూన్ 10 నుంచి 13 వరకు వానలు పడుతాయని తెలిపింది. త్రిపురలో జూన్ 8 నుంచి 12 ఈదురు గాలులతో కూడిన వానలు పడుతాయని ఐఎండీ వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?

రుతుపవనాల ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లోనూ వానలు కురుస్తాయని తెలిపింది. కేరళ,  కర్ణాటక, లక్షద్వీప్ లో ఈ వారంలో వర్షాలు పడతాని తెలిపింది. జూన్ 10 నుంచి 14 మధ్య తమిళనాడు, పుదుచ్చేరి,  ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జూన్ 13, 14న కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని  ఐఎండీ వెల్లడించింది. అటు బీహార్,  ఝార్ఖండ్, ఛత్తీస్‌ గఢ్, ఒడిశా, బెంగాల్ లో ఈదురు గాలులు, మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది.  జూన్ 9న అండమాన్, నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.

ఉత్తరాదిన మండే ఎండలు   

అటు రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో జూన్ 8 నుంచి 11 వరకూ వేడి గాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. రాజస్థాన్‌లో జూన్ 9న వేడి తీవ్రంగా ఉంటుందని తెలిపింది.  పంజాబ్, హర్యానా, ఢిల్లీలకు జూన్ 9, 10 తేదీల్లో రాత్రి పూట కూడా వేడిగా ఉంటుందని వెల్లడించింది. జూన్ 11 నుంచి 14 వరకూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక గోవా, మహారాష్ట్ర, మరాఠ్వాడా ప్రాంతాల్లో జూన్ 8 నుంచి 14 వరకూ వర్షాలు పడుతాయని తెలిపింది. జూన్ 12 నుంచి 14 వరకూ కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Read Also: మూడు రోజులు వానలు, ఆ తర్వాత మళ్లీ ఎండలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button