
కేబినెట్ విస్తరణ లేదు.. నామినేటెడ్ పదవుల భర్తీ ఊసేలేదు. పదవుల కోసం ఎదురుచూసి.. చూసి.. కళ్లు కాయలు కాస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్న దాటుతోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.. అన్న మాట.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలో వినిపిస్తోంది. ఈ పంచాయతీ.. ఢిల్లీ వరకు చేరింది. విన్నపాలు వినండి మహాప్రభూ అంటూ హస్తిన వెళ్లి పార్టీ పెద్దలతో మొరపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్లోని మాదిక ఎమ్మెల్యేలు.. మంత్రి పదవి కోసం ఆరాటపడుతున్నారు. పార్టీ పెద్దలకు వినతిపత్రాలు ఇచ్చి వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది…? వారి విన్నపాలు పార్టీ పెద్దలు విన్నారా…? సమస్యకు పరిష్కారం చూపిస్తామన్నారా…?
తెలంగాణలో 50లక్షల వరకు మాదిగలు ఉన్నారు. కేబినెట్లో తమ వర్గానికి స్థానం కల్పించాలని కోరుతున్నారు. సీఎం రేవంత్రెడ్డిని కలిసి… ఈ విషయం చర్చించారు. ఎస్సీ వర్గీకరణ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికీ.. చెప్పుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కూడా కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దృష్టికి, అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు మీనాక్షి నటరాజన్. ఇంత వరకు బాగానే ఉంది. అయితే… కేబినెట్ విస్తరణ జరిగేదెప్పుడు… తమకు మంత్రి ఇచ్చేదెప్పుడు… అందుకోసం ఇంకెంత కాలం ఎదురుచూడాలి అన్నది కాంగ్రెస్లోని మాదిగ ఎమ్మెల్యేల ఆవేదన. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్న దాటుతోంది. ఇంకెప్పుడు… పదవి వస్తుందని… అని వారు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర మంత్రి వర్గంలో 18 పదవులు ఉండగా… ప్రస్తుతం 12మంది మంత్రులయ్యారు. ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు అసెంబ్లీ చీఫ్ విప్, మండలి విప్ పదవులను కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఏడాదిన్నర అవుతున్నా… ఇప్పటికీ ఆ పదవులు భర్తీ చేయకుండా వదిలేయడం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి కారణమవుతుంది. మరోవైపు… అధిష్టానానికి కూడా ఎటూ పాలుపోవడం లేదు. మంత్రి పదవులకు… పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. దీంతో.. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారింది కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి.