IAS Officer Enrolling Daughter in Anganwadi: ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ పులకిత్ గార్గ్ తన మూడేళ్ల కూతురిని ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రంలో చేర్పించారు. చిత్రకూట్ జిల్లాలోని ఓ అంగన్వాడీ కేంద్రానికి పంపించారు. తన నిర్ణయం సరైనదేనని గార్గ్ తెలిపారు. ప్రస్తుతం ఆయన జిల్లా మెజిస్ట్రేట్గా ఉన్నారు.
మెరుగుపడిన ప్రభుత్వ విద్య
గత కొన్నేళ్లల్లో ప్రభుత్వ విద్యావ్యవస్థ ఎంతో మెరుగుపడిందని అన్నారు. “పరిస్థితులు ఒకప్పటిలా ప్రస్తుతం లేవు. విద్యలో నాణ్యత ఎంతో పెరిగింది. ఎన్నో వనరులు అందుబాటులోకి వచ్చాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన బిడ్డను ప్రభుత్వ స్కూల్లో చేర్పిస్తే సాధారణ ప్రజలు కూడా తమ పిల్లల్ని ఎలాంటి సంకోచం లేకుండా ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తారు” అని ఆయన చెప్పుకొచ్చారు.
పిల్లల బాల్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం!
ప్రభుత్వ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో మౌలికవసతులపై ప్రజాభిప్రాయం మారిందని కూడా ఆయన చెప్పారు. పిల్లల బాల్యంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని పులకిత్ గార్గ్ అన్నారు. పిల్లల ఆరోగ్యం కోసం పోషకాహారం అందించడంతోపాటు వారికి విలువలనూ బోధించాలని అన్నారు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి అంగన్వాడీ సెంటర్లలో అన్నీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ స్కూళ్లపై ఉన్న దురభిప్రాయాలను తొలగించుకుని స్థానికులు అందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. ఆయన తన కూతురి వీడియోను కూడా షేర్ చేశారు.





