తెలంగాణ

“హైడ్రా” దృష్టి పెట్టాలి – అసైన్డ్ భూములపై మళ్లీ ప్రజల డిమాండ్

మన్సూరాబాద్‌లో రూ.50 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిపై అక్రమాల ఆరోపణలు

క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : ఎల్బీనగర్ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్‌లో చిన్న చెరువు కట్ట కింద ఉన్న సుమారు 12.13 ఎకరాల ప్రభుత్వ (అసైన్డ్) భూమి అక్రమంగా స్థానిక రాజకీయ నేత కుటుంబం ఆధీనంలో ఉందన్న ఆరోపణలు మళ్లీ ముదిరాయి. ఈ భూముల విలువ రూ.50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

ఈ భూమిని ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అసైన్డ్ చేసింది. కానీ 2005లో ప్రజా సేవలో ఉన్న రాజకీయ నేత అనే వ్యక్తి భూమిని స్వాధీనం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలపై అప్పట్లో కేసులు కూడా నమోదు అయినట్లు సమాచారం. అయినప్పటికీ, ధనబలం, అంగబలంతో పేదలను బలవంతంగా వెళ్ళగొట్టి భూములను ఆక్రమించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇప్పుడు ఆ స్థలంలో పూర్తి స్థాయి నిర్మాణాలు లేకపోయినా, తాత్కాలిక షెడ్‌లు ఏర్పాటు చేసి వాటిని వాణిజ్య ప్రయోజనాల కోసం కిరాయికి ఇస్తూ పెద్ద ఎత్తున అక్రమ లాభాలు పొందుతున్నట్లు తెలుస్తోంది. హెచ్.పి పెట్రోల్ బంక్, బార్, వైన్స్ వంటి వాటితో పాటు అనేక షెడ్‌లు కామినేని ఆసుపత్రి మన్సూరాబాద్ రహదారి పక్కన కనిపిస్తుండటంతో కబ్జా వ్యవహారం స్పష్టంగా కనిపిస్తోందని స్థానికుల అభిప్రాయం.

రంగారెడ్డి జిల్లా, సరూర్ నగర్ మండలం, మన్సూరాబాద్ రెవెన్యూ సర్వే నెం.93/1 లోని ఈ భూమిపై హైడ్రా వంటి విశేష దృష్టి సాంకేతిక బృందం లేదా రెవెన్యూ – ల్యాండ్ గృహ శాఖల ద్వారా సమగ్ర విచారణ జరిపి, భూమిని మళ్లీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. “అసైన్డ్ భూముల పై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించి. అసలైన హక్కుదారులకు కనీసం తలదాచుకునే చోటకూ నోచుకోలేక పోతే, ఇదేనా అభివృద్ధి?” అని స్థానిక ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button