
Hyderabad Rains: గత కొద్ది రోజులుగా ఎండలతో మండిన హైదరాబాద్ చల్లబడింది. నగరం అంతటా కారుమబ్బులు కమ్ముకున్నాయి. సోమవారం నాడు భాగ్యనగరం అంతటా వాన కురిసింది. రాజేంద్రనగర్, మల్కాజిగిరి, ముషీరాబాద్, ఉప్పల్, షేక్ పేట, అల్వాల్, మారేడ్ పల్లి, శేరిలింగంపల్లి బాలానగర్ సహా పలు ప్రాంతాల్లో వానలు పడ్డాయి. పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి.
ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు బేగంపేటలోని వాతావరణ శాఖ అధికారులు కీలక ప్రకటన జారీ చేశారు. మంగళ, బుధ, గురు వారాల్లో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈమేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల గాలులు ఉత్తర దిశగా గంటకు 6-10 కిలోమీరట్ల వేగంతో వీస్తాయని ప్రకటించింది.
వర్షం పడే సమయంలో బయటకు రావద్దన్న అధికారులు
అటు ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాక అధికారులు తెలిపారు. వర్షం పడే సమయంలో బయటకు రాకుండా ఉండటం మంచిదని సూచించారు.
Read Also: మరో 5 రోజులు వానలు, ఎప్పుడు, ఏ జిల్లాల్లో కురుస్తాయంటే?