
Maganti Gopinath: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయారనే వార్తలు తెలంగాణ వ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశాయి. గురువారం (జూన్ 5) సాయంత్రం సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు వచ్చాయి. చాలా మంది ఆయన మృతికి సంతాపం తెలుపుతూ పోస్టులు కూడా పెట్టారు. ఆ తర్వాత.. గోపీనాథ్ చనిపోలేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గుండె సంబంధిత సమస్యతో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెల్లడించారు. ఆయన వైద్యానికి స్పందిస్తున్నట్లు తెలిపారు. కోలుకుంటున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, ముఠాగోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆసుపత్రికి చేరుకుని గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సీనియర్ వైద్యులు చికిత్స అందిస్తున్నారని, క్షేమంగా బయటికొస్తారనే విశ్వాసం ఉందన్నారు. 48 గంటల తర్వాత వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారని గులాబీ పార్టీ నాయకులు తెలిపారు.
ఇంతకీ పుకార్లు ఎలా వ్యాపించారంటే?
వాస్తవానికి గత కొంతకాలంగా మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండె సంబంధ సమస్యలో తరచుగా హాస్పిటల్ కు వెళ్తున్నారు. నిన్న సాయంత్రం సమయంలోనూ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఒకానొక సమయంలో పల్స్ పూర్తిగా పడిపోయినట్లు తెలిసింది. ఈ విషయం కొన్ని మీడియా సంస్థలకు తెలియడంతో ఆయన చనిపోయారంటూ హడావిడి చేశారు. కానీ, హాస్పిటల్ లో ఆయనకు వెంటిలేటర్ అమర్చగానే పల్స్ మళ్లీ కొట్టుకోవడం మొదలు పెట్టింది. వైద్యుల బృందం ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో వైద్యులు పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
ఎవరీ మాగంటి గోపీనాథ్? ఏంటి ఆయన బ్యాగ్రౌండ్?
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు మాగంటి గోపీనాథ్. 2014, 2018, 2023 ఎన్నిల్లో విజయం సాధించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన సినిమా రంగంలో రాణించారు. నాలుగు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ‘పాతబస్తీ’,’రవన్న’, ‘భద్రాద్రి రాముడు’, ‘నా స్టైలే వేరు’ సినిమాలను తెరకెక్కించారు. ఈ సినిమాలు అంతగా ఆడకపోవడంతో ఆర్థికంగా దెబ్బతిన్నారు. సినిమాల్లో ఫెల్యూర్ గా నిలిచినా, రాజకీయాల్లో మాత్రం సక్సెస్ అయ్యారు. హ్యాట్రిక్ హిట్ కొట్టారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గోపీనాథ్ కు భార్య సునీత, కొడుకు వాత్సల్యనాథ్, కూతుళ్ళు దివ్య అక్షరనాగ్, దిశిర ఉన్నారు. గోపీనాథ్ తండ్రి మాగంటి కృష్ణమూర్తి ఆంధ్రా నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డారు.
Read Also: ఎవరి జోక్యం లేదు.. రాహుల్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్!