క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ కోర్టు ధిక్కారానికి (Contempt of Court) పాల్పడినట్లు తెలంగాణ హైకోర్టు నిర్ధారించింది. సోమవారం (మార్చి 23, 2026) జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ బి.ఆర్. మధుసూదన రావులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
అంబర్పేట్లోని బతుకమ్మకుంట (సుమారు ఏడు ఎకరాల స్థలం) విషయంలో యథాతథ స్థితి (Status Quo) ని కొనసాగించాలని గత ఏడాది జూన్ 12న హైకోర్టు ఆదేశించింది. కేవలం వర్షాకాలానికి ముందు వరదల నివారణ పనులకు మాత్రమే అనుమతినిచ్చింది. అయితే, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఆ స్థలాన్ని పార్కుగా మార్చడం, గేట్లు ఏర్పాటు చేయడం, సైన్ బోర్డులు పెట్టడం వంటి పనులు చేపట్టడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైకోర్టు ఆదేశాలు…
బతుకమ్మకుంటలో ఏర్పాటు చేసిన అన్ని నిర్మాణాలు, సైన్ బోర్డులను 4 వారాలలోపు తొలగించాలి.
ఆ స్థలాన్ని జూన్ 12, 2025 నాటికి ఏ స్థితిలో ఉందో అదే యథాతథ స్థితికి తీసుకురావాలి.
ఈ ఆదేశాల అమలుపై ఏప్రిల్ 27, 2026 లోగా నివేదిక సమర్పించాలని కమిషనర్ను ఆదేశించింది.
కోర్టు వ్యాఖ్యలు: చట్టానికి ఎవరూ అతీతులు కారని, హైడ్రా తన పరిధిని మించి వ్యవహరిస్తోందని ధర్మాసనం పేర్కొంది. జైలు శిక్ష విధించడం ఈ సందర్భంలో సరైనది కాదని భావిస్తూ, కోర్టు గౌరవాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
