High Alert: తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతాలు మరోసారి తుపాకుల మోతతో మారుమోగుతున్నాయి. సరిహద్దు వెంట విస్తరించిన దట్టమైన అడవుల్లో భద్రతా బలగాలు చేపట్టిన విస్తృత సెర్చ్ ఆపరేషన్ ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా సరిహద్దుకు ఆనుకుని ఉన్న కర్రెగుట్ట అటవీ ప్రాంతం ప్రస్తుతం భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య గెరిల్లా తరహా ఎదురుకాల్పులకు వేదికగా మారినట్లు సమాచారం. అగ్రనేతలను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఈ భారీ దళాల కదలికలతో అడవి ప్రాంతం యుద్ధభూమిని తలపిస్తోంది.
మావోయిస్టులు రహస్యంగా నిర్మించుకున్న బంకర్లను గుర్తించిన భద్రతా సిబ్బంది వాటిని ధ్వంసం చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యేక దళాలుగా పేరుగాంచిన కోబ్రా దళాలు ఇటీవల పలుచోట్ల బంకర్లను నేలమట్టం చేసినట్లు తెలుస్తోంది. జెల్ల, తడపాల, డోలి అటవీ పరిసర ప్రాంతాల్లో విస్తృత కూంబింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో బలగాల కదలికలను అడ్డుకునేందుకు మావోయిస్టులు అమర్చిన పలు మందుపాతరలను బాంబు నిర్వీర్య దళాలు గుర్తించి నిర్వీర్యం చేస్తున్నాయి. కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు మారుమోగుతుండటంతో సమీప గిరిజన గ్రామాలు భయాందోళనలకు గురవుతున్నాయి.
అడవుల్లో అంగుళం అంగుళం చొప్పున భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. సాంకేతిక పరికరాల సాయంతో అనుమానాస్పద కదలికలను పర్యవేక్షిస్తున్నారు. సరిహద్దు దాటి పారిపోకుండా ఇరురాష్ట్రాల పోలీసులు సమన్వయంతో సంయుక్త చర్యలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక దళాలుగా పేరొందిన గ్రేహౌండ్స్ సిబ్బంది కూడా ఈ ఆపరేషన్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మిగిలి ఉన్న అగ్రనేతలు అదుపులోకి వస్తే సాయుధ కార్యకలాపాలకు గట్టి దెబ్బ తగులుతుందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కోసం కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. అదే సమయంలో జార్ఖండ్లోని అత్యంత ప్రమాదకర అటవీ ప్రాంతంగా భావించే శరందా అటవీ ప్రాంతంలో మిసిర్ బేస్రా కోసం ప్రత్యేక దళాలు శోధన కొనసాగిస్తున్నాయి. దట్టమైన అడవులు, కఠిన భౌగోళిక పరిస్థితులు ఉన్నప్పటికీ భద్రతా బలగాలు వెనుకడుగు వేయకుండా క్రమబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం. మొత్తం మీద సరిహద్దు అటవీ ప్రాంతాలు ప్రస్తుతం అత్యంత ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.
ALSO READ: ఈ వారం ప్రేక్షకులను సందడి చేయనున్న చిత్రాలు ఇవే!

