
Rains In Telangana: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపిలేని వానలతో హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈనెల 21 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వచ్చే రెండు వారాల పాటు ముసురు పట్టి ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. వాతావరణం పూర్తిగా చల్లబడి, జల్లులు కురుస్తాయన్నారు. అప్పుడప్పుడు భారీ వర్షాలు పడతాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం
ఇక సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ మేరకు సదరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అటు ఈనెల 13 నుంచి 16 వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ నాలుగు రోజులకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో రాబోయే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు, ఈనెల 13 నాటికి వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
Read Also: కోస్తాలో భారీ వర్షాలు.. ఎన్ని రోజులు అంటే?