సపోట పండులో ఎలుకల మందు ఇచ్చి దారుణం
చికిత్స పొందుతూ చిన్నారి మృతి
యాదాద్రి, క్రైమ్ మిర్రర్ః యాదాద్రి జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం లచ్చమ్మగూడెంలోదారుణం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా చూడాల్సిన కన్నతండ్రే చిన్నారిని ఎలుకమందు ఇచ్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు వివరాల ప్రకారం. వరికుప్పల రవికి మూడేళ్ల కింద స్వాతితో పెళ్లి అయింది. వీరికి మేఘన (2), 9 నెలల చిన్నారి మయూరి ఉన్నారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో చిన్న కుమార్తెతో కలిసి స్వాతి కొన్నాళ్లుగా అమ్మవారి ఊరిలో ఉంటోంది. కాగా మేఘన తండ్రి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో పెద్ద కూతురు మేఘనను తన వద్దకు పంపించాలని స్వాతి ఊరి పెద్దలను కోరింది. భర్త వినకపోవడంతో మాడుగులపల్లి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నారాయణపురం పోలీసులకు సమాచారం అందజేశారు.
దీంతో పోలీసులు రవిని పిలిపించి మాట్లాడారు. పెద్దమనుషుల సమక్షంలో సోమవారం మాట్లాడుకోవాల్సి ఉండగా అంతలోనే అతను తన కూతురును చంపాలని నిర్ణయించుకున్నాడు. శనివారం సపోటా పండులో ఎలుకల మందు పెట్టి కూతురుకు ఇచ్చాడు. దీంతో ఆ పండును తిన్న కూతురు కొద్దిసేపటికే వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
తండ్రి కూడా నిద్రమాత్రలు, ఎలుకల మందు నీళ్లలో కలిపి తాగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు రవిని నల్లగొండ ఆసుపత్రికి, చిన్నారిని నిలోఫర్కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం చిన్నారి మృతిచెందింది. భార్య స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు రవి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.
