
-
చెరువు ఆయకట్టుకింది అసైన్డ్ భూమిని వదలని భూ బకాసురులు
-
సుమారు 12.13 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ అన్యాక్రాంతం
-
సదరు భూమిలో పెట్రోల్ బంకులు, బార్లు, వైన్ షాపులు, షెడ్లు వెలిసిన వైనం
-
వేరు వేరు పార్టీలలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన మాజీ, తాజా ప్రజా ప్రతినిధులు
-
చోద్యం చూస్తున్న సరూర్ నగర్ మండల రెవెన్యూ అధికారులు
-
హైడ్రా దృష్టి సాధించాలని కోరుతున్న స్థానికులు
చిన్న చెరువు కబ్జాదారుల కబంధ హస్తాల్లో దాదాపు కుచించుకుపోయింది. దీనికి తోడు చెరువు కట్ట కింద ఉన్న సర్కార్ (అసైన్డ్) భూమిని సైతం భూ బకాసురులు పూర్తిగా మింగేశారు. ఇదెక్కడో మారుమూల మండలంలోనో.. గ్రామంలోనో అనుకుంటే బురదలో కాలేసినట్లే. నగరం నడిబొడ్డున రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండల పరిధిలోనే. సరూర్ నగర్ మండలం, మన్సురాబాద్ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 93/1 పరిధిలో 12.13 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇది చిన్న చెరువు కట్ట కింద ఉన్నటువంటి సర్కార్ ల్యాండ్. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ హయాంలో కొంత మంది ఎస్సీ పేద రైతులకు అప్పటి ప్రభుత్వం సాగు చేసుకోవడానికి అసైన్డ్ చేసింది. సదురు భూమి ఇప్పటికి రెవెన్యూ రికార్డులలో ప్రభుత్వ భూమి గానే నమోదై ఉంది. అయితే అప్పట్లో అసైన్డ్ చేసిన పేదలను సదురు కుటుంబం తమ ధన, అంగబలంతో వారి నుంచి స్వాధీన పరుచుకున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. స్థానికంగా ఉండే సదురు కుటుంబ సభ్యులు వేర్వేరు పార్టీలలో ఉన్న ఒకే కుటుంబం కావడంతో వీరి కబ్జా నుంచి సర్కార్ భూమిని అధికారులు స్వాధీనం చేసుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికైనా సరూర్ నగర్ మండల రెవెన్యూ అధికారులు, ఇబ్రహీంపట్నం ఆర్డిఓ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వందల కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలని పలువురు కోరుతున్నారు. దీనిపై హైడ్రా కూడా దృష్టి సాధించి విలువైన భూమిని ప్రజల ఉపయోగాలు వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా బ్యూరో, క్రైమ్ మిర్రర్ : చెరువులు కుంటలు ప్రభుత్వ భూముల కబ్జాలపై ఉక్కు పాదం మోపుతున్న హైడ్రా అధికారులు ఓసారి చిన్న చెరువు ఆయకట్టు కింది సర్కార్ భూమిపై కూడా నజర్ వేయాలని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా, సరూర్ నగర్ మండల పరిధిలోని మన్సురాబాద్ గ్రామ రెవెన్యూ లో రికార్డుల ప్రకారం 12.13 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇది ఇప్పటికే కబ్జాదారుల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయింది. కానీ సదురు ఆక్రమణదారులు అందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా తాత్కాలిక షెడ్లు, బార్లు, వైన్స్ నిర్మాణాలు చేపట్టారు. మరికొంత భాగంలో ఓ పెట్రోల్ బంక్ కు అద్దెకు ఇచ్చారు. దాని పక్కనే మరో పక్క పూర్తి స్థాయి నిర్మాణాలను కూడా చేపట్టారు. సైట్ విజిట్ చేస్తే తెలిసిపోతుంది. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుంచి విడిపించాలని ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు కోరుతున్నారు.
చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు..!
రంగారెడ్డి జిల్లా, సరూర్ నగర్ మండల పరిధిలో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో రెవెన్యూ అధికారులకు తెలియదనుకోవడం హాస్యాస్పదం. మన్సూరాబాద్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న 12.13 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడ్డానికి రెవెన్యూ అధికారులు తీసుకున్న చర్యలు శూన్యం. దీంతో స్థానిక ప్రజల్లో కూడా రెవెన్యూ అధికారులపై నమ్మకం పోయింది. ఇప్పటికైనా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ప్రభుత్వం జోక్యం చేసుకొని వందల కోట్ల ప్రభుత్వ భూమి కాపాడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. హైడ్రా అధికారులు కూడా దృష్టి సారించాలని కోరుతున్నారు. త్వరలోనే అన్ని ఆధారాలతో హైడ్రాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు పలు ప్రజాసంఘాల నేతలు తెలియజేశారు.
ఈ కబ్జాలపై మరో కథనంతో మీ ముందుకు.. క్రైమ్ మిర్రర్..