Ghaziabad Triple Suicide: విద్యార్థులు, యువత ఆన్లైన్ గేమింగ్కు బానిసలుగా మారిపోతున్నారు. మొబైల్ ఫోన్లలో ఆన్లైన్ గేమ్లు ఆడుతూ.. బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా గంటల తరబడి ఫోన్లలోనే గడిపేస్తున్నారు. తల్లిదండ్రులు వారించినా తీరు మార్చుకోవడం లేదు. ఆన్లైన్ గేమ్లకు బానిసలైన వారికి ఫోన్ అందుబాటులో లేకుండా చేస్తే.. మానసికంగా కుంగిపోతున్నారు. బలవన్మరణాలకూ పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాంటి దారుణమే ఘజియాబాద్లో చోటుచేసుకుంది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
కొరియా ఆన్లైన్ గేమ్కు బానిసలై ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు వారికి ఫోన్ ఇవ్వకపోవడం వల్ల మనస్తాపానికి గురై 9వ అంతస్తు నుంచి దూకేశారు. ఉత్తర్ప్రదేశ్లోని ఘజియాబాద్లో ఓ రెసిడెన్షియల్ టౌన్షి్పలో నివసిస్తున్న చేతన్ కుమార్కు ఇద్దరు భార్యలు. ఐదుగురు సంతానం. వారిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు నిషిక(16), ప్రాచి(14), పాఖి(12)లకు కరోనా సమయంలో మొబైల్ ఫోన్ అలవాటైంది. తర్వాత ఆన్లైన్ గేమ్స్ ఆడడం వ్యసనంగా మారింది. చదువును కూడా పక్కనపెట్టేశారు. బడి మానేశారు. వారి ప్రవర్తనపై ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. ఫోన్ వాడకం తగ్గించాలంటూ పిల్లలను మందలించేవారు. వారికి ఫోన్ అందుబాటులో లేకుండా చేశారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అక్కాచెల్లెళ్లు ముగ్గురూ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు.
అర్థరాత్రి సమయంలో ఆత్మహత్య
చేతన్ కుమార్ ఉంటున్న ఫ్లాట్ 9వ అంతస్తులో ఉంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో అక్కాచెల్లెళ్లు బాల్కనీలోకి వెళ్లి, ఒకరి తర్వాత ఒకరు కిందకి దూకేశారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆ బాలికలు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, గేమ్ టాస్క్లో భాగంగానే వారు ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.





