
AP Heavy Rains: ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవన ద్రోణి తూర్పు భాగం దక్షిణాది వైపు కొనసాగుతోంది. ఇప్పటికే దక్షిణ చత్తీస్ గఢ్, విశాఖపట్నం మీదుగా బంగాళాఖాతం వరకూ విస్తరించింది. దీనికి తోడు చత్తీస్ గఢ్ పై అల్పపీడనం ఉంది. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతం నుంచి భారీగా తేమగాలులు ఉత్తర కోస్తాపైకి వీస్తుండడంతో పలు జిల్లాల్లో చిరుజల్లుల నుంచి ఒక మోస్తరుగా వర్షాలు కురిశాయి.
ఆదివారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆదివారం కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుం టూరు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
సోమవారం మరో అల్పపీడనం
సోమవారం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ద్రోణి, అల్పపీడనం ప్రభావాలతో సోమవారం కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృ ష్ణా, గుంటూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పల్నా డు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 19న అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో అతిభారీ, కోస్తాలో శ్రీకాకుళం నుంచి పల్నాడు వరకు ఉన్న జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Read Also: రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!