
తెలంగాణలో కేబినెట్ విస్తరణ పెద్ద చిక్కుముడిగా మారుతోంది. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉందని సమాచారం. దీంతో.. ఆశావహులు పదవి కోసం పోటీ పడుతున్నారు. ప్రస్తుతం కేబినెట్లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిని సామాజిక వర్గాల వారీగా కేటాయించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒకటి మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించినట్టు సమాచారం. ఈ పదవికి పోటీ విపరీతంగా ఉంది. మంత్రి పదవి రేసులో ముందుగా కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేరు వినిపిస్తుండగా… మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్రెడ్డి, రామ్మోహన్రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. తనకు మంత్రి ఖాయమని భావిస్తున్న రాజగోపాల్రెడ్డి… తనకు హోంశాఖ అంటే ఇష్టమని… ఆ పదవికి ఇస్తే బాగుంటుందని మనసులో మాట కూడా బయటపెట్టేశారు.
ఇక.. మల్రెడ్డి రంగారెడ్డి. ఆయన కూడా మంత్రి పదవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మంత్రి పదవి ఇవ్వకపోతే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమే అని ఆయన హెచ్చరించారు. సుదర్శన్రెడ్డి, రామ్మోహన్రెడ్డి కూడా… పార్టీపై ఒత్తిడి పెడుతున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్రెడ్డి ఎవరి వైపు మొగ్గుచూపుతారో తెలియాల్సి ఉంది.
Also Read : వెంకట్ రెడ్డి, కొండా, జూపల్లి అవుట్? కొత్తగా ఆరుగురికి అవకాశం!
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే.. రాజగోపాల్రెడ్డి సోదరుడు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిలో ఉన్నారు. ఇప్పుడు రాజగోపాల్రెడ్డికి కూడా మంత్రి పదవి ఇస్తే.. ఒకే కుటుంబానికి రెండు మంత్రి పదవులు ఇచ్చినట్టు అవుతుంది. దీని వల్ల.. మిగిలిన వాళ్లు గోల పెట్టేస్తారు. వ్యతిరేకత వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అయితే.. భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్రెడ్డి… రాజగోపాల్రెడ్డి హామీ ఇచ్చారట. ఆ హామీని నిలబెట్టుకోవాలని రాజగోపాల్రెడ్డి కోరుతున్నారు. కేబినెట్ విస్తరణలో ఆయనకు మినిస్ట్రీ ఖాయమైందని కూడా వార్తలు వస్తున్నాయి. మరి… రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఇస్తే… ఎదురయ్యే సమస్యలను కాంగ్రెస్ ఎలా హ్యాండిల్ చేస్తుంది.. అసంతృప్తులను ఎలా బుజ్జగిస్తుంది.. అనేది చూడాలి.