Emmanuel Macron: భారత్లో నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ మంగళవారం ఉదయం ముంబై నగర ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశారు. దౌత్యపరమైన సమావేశాలు, అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత ఆరోగ్యంపై చూపుతున్న శ్రద్ధ అందరినీ ఆకట్టుకుంది. ఉదయం సమయంలో ముంబై వీధుల్లో జాగింగ్ చేస్తూ కనిపించిన మెక్రాన్కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించాయి.
మంగళవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో చర్చ్ గేట్, మెరైన్ డ్రైవ్ పరిసరాల్లో ఆయన జాగింగ్ చేశారు. నేవీ బ్లూ రంగు టీ షర్ట్, సన్ గ్లాసెస్ ధరించి సాధారణ పౌరుడిలా పరుగులు తీస్తూ కనిపించారు. ఆయన వెంట ఫ్రెంచ్ మరియు భారత భద్రతా సిబ్బంది అప్రమత్తంగా అనుసరించారు. కోస్టల్ రోడ్ ప్రాంతంలో ఆయన జాగింగ్ను చూసిన స్థానికులు ఆసక్తిగా గమనించారు. ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా భద్రతా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక విదేశీ దేశాధ్యక్షుడు ఇంత సాదాసీదాగా నగర వీధుల్లో పరుగులు తీయడం అరుదైన దృశ్యమని పలువురు అభిప్రాయపడ్డారు.
జాగింగ్ అనంతరం మెక్రాన్ తన సతీమణి బ్రిగిట్టే మెక్రాన్తో కలిసి దక్షిణ ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ను సందర్శించారు. 2008 నవంబర్ 26 ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు ఫ్రాన్స్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఐక్యతతో, దృఢ సంకల్పంతోనే ఉగ్రవాదాన్ని ఎదుర్కొనగలమని స్పష్టం చేశారు. ఈ సందర్శన ద్వారా భారత్తో ఫ్రాన్స్కు ఉన్న స్నేహబంధాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు.
అనంతరం ముంబైలోని లోక్ భవన్లో ప్రధాని నరేంద్ర మోడీతో మెక్రాన్ భేటీ అయ్యారు. ఇరువురు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించారు. రక్షణ, సాంకేతిక, వాణిజ్య రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ భారత్-ఫ్రాన్స్ సంబంధాలకు మరింత బలాన్ని చేకూర్చే దిశగా కీలకంగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: నగరం నిద్రపోతున్న వేళ… అమావాస్య అర్థరాత్రి
