Trump Warns India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సంతోషంగా లేననే విషయం భారత ప్రధాని మోదీకి తెలుసునన్నారు. తనను సంతోషపరిచేందుకు భారత్ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. మోడీ మంచి వ్యక్తి అని, కానీ.. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ ఇలాగే కొనసాగిస్తే మాత్రం భారత్పై త్వరలోనే టారి్ఫలు పెంచేస్తానని హెచ్చరించారు. ఆదివారం ఎయిర్ఫోర్స్ వన్లో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సెనేటర్ లిండ్సే కీలక వ్యాఖ్యలు
మరోవైపు భారత్పై టారిఫ్లు తగ్గించాలంటూ అమెరికాలో భారత రాయబారి వినయ్మోహన్ క్వాత్రా తమను కోరారని అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం తెలిపారు. గత నెలలో తాను వినయ్మోహన్ను ఆయన నివాసంలో కలిసిన సందర్భంలో ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చారని, 25 శాతం టారిఫ్ నుంచి భారత్ను ఉపశమనం కలిగించాల్సిందిగా కోరారని చెప్పారు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ తగ్గించుకునేలా చేసేందుకే ట్రంప్ ఈ టారిఫ్ విధించారని గ్రాహం అన్నారు.
కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యవహారశైలిని ప్రతిపక్ష కాంగ్రెస్ తప్పుబట్టింది. అమెరికా సెనేటర్ చేసిన వ్యాఖ్యలు.. ట్రంప్ దగ్గర మోడీ మోకరిల్లుతున్న తీరును స్పష్టం చేస్తున్నాయని సోషల్ మీడియాలో కాంగ్రెస్ పేర్కొంది. ట్రంప్ కోసం చిరకాల మిత్ర దేశమైన రష్యా నుంచి చమురు కొనుగోలును కూడా మోడీ నిలిపివేశారని ఆరోపించింది. మోడీ తన వ్యక్తిగత పరపతి పెంచుకునేందుకు, ట్రంప్ను సంతోషపరిచేందుకు దేశానికి ఎందుకు హాని చేస్తున్నారని ప్రశ్నించింది. మోడీ స్నేహితుడు భారత్కు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. మేలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ట్రంప్పై పొగడ్తలు కురిపిస్తూనే ఉన్నారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు.





