-
నియోజకవర్గాల పునర్విభజనతో తలరాతలు తారుమారు
-
వైయస్సార్ కాంగ్రెస్ బలమైన నియోజకవర్గాల్లో సీన్ రివర్స్
-
కూటమికి ఇది ప్లస్ పాయింట్
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఆందోళన వెంటాడుతోంది. ఆ పార్టీకి బలమైన నియోజకవర్గాలు పునర్విభజనలో కనుమరుగవుతాయి అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రధాన నాయకుల నియోజకవర్గాలు మహిళలకు రిజర్వేషన్ అవుతాయని.. రిజర్వుడ్ నియోజకవర్గాలుగా మారుతాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. చివరకు పులివెందుల లాంటి నియోజకవర్గం సైతం రిజర్వేషన్లలో తారుమారు అవుతుందని ప్రచారం జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని కేంద్రం స్పష్టతనిచ్చింది. కచ్చితంగా ఇది ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న టిడిపికి అడ్వాంటేజ్ గా మారుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పరపతిని వినియోగించుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తారన్న ప్రచారం కూడా ఉంది.
ఒక్కసారి మాత్రమే ఛాన్స్..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటివరకు మూడు ఎన్నికలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. రాష్ట్ర విభజన జరగడం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలో దిగడం ఒకేసారి జరిగిపోయింది. 2014లో ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు సీనియారిటీని గుర్తించారు ఏపీ ప్రజలు. అదే సమయంలో అధికార పార్టీకి ధీటుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. 2019 ఎన్నికల్లో అయితే ఏకపక్ష మద్దతు తెలిపారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అదే ఏకపక్షంగా తిరస్కరించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి ఇవ్వలేదు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూసే అవకాశం లేదు. ఎందుకంటే ఆ పార్టీకి బలమైన ప్రతిపక్షంగా ఛాన్స్ ఇచ్చారు. అంతకుమించి ఏకపక్షంగా అధికారం ఇచ్చారు. అటు ప్రతిపక్షంగా బలమైన పాత్ర పోషించలేదు. అధికారపక్షంగా తన పాత్ర కొనసాగించలేకపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఆ పార్టీకి దారుణ ఫలితాలు వచ్చాయి.
వచ్చే ఎన్నికలు డౌట్..
అయితే 2029 ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. క్షేత్రస్థాయిలో మాత్రం ఏ పరిస్థితి కూడా ఆ పార్టీకి కలిసి రావడం లేదు. సందట్లో సడే మియా అన్నట్టు నియోజకవర్గాల పునర్విభజన ఆ పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారింది . ఆ పార్టీకి బలమైన ప్రాంతాలు, బలమైన జిల్లాలు, బలమైన నియోజకవర్గాల్లో రిజర్వేషన్లు తారుమారు అయ్యే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్లుగా.. ఎస్సీ ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలుగా మారే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే 2009లో ఇదే మాదిరిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకున్నారు పునర్విభజనను. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే ఫార్ములాను అనుసరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడుగడుగునా భయంతో గడుపుతున్నారు. అధికార పార్టీకి ధీటుగా ఎదుర్కొనలేకపోతున్నారు.
