-
11 మావోయిస్టు రహిత రాష్ర్టాలుగా ప్రకటన
-
చివరి రోజు 44 మంది మాయివోస్టులు లొంగుబాటు
న్యూఢిల్లీ, క్రైమ్ మిర్రర్: మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కేంద్రం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఆపరేషన్ కగార్ నిన్నటి ముగిసింది. కగార్ ముగింపుకు చివరి రోజు కావడంతో 44 మంది మావోయిస్టులు లొంగిపోయారు. చత్తీష్గడ్లో 35 మంది,బీజాపూర్లో 25 మంది లొంగిపోయినట్లు తెలిపారు. దంతెవాడలో ఐదుగురు, సుక్మాలో ఇద్దరు, నారాయణ్పూర్లో ఒక్కరు, కాంకేర్లో ఇద్దరు మహారాష్ట్రలోని గడ్చిరోలిలో తొమ్మిది మంది నక్సలైట్లు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారు.
కేంద్రం విధించిన డెడ్లైన్లు ముగిసిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు మావోయిస్టుల నుంచి విముక్తి పొందినట్టుగా ప్రకటించుకున్నాయి. మావోయిస్టు పార్టీ పొలిటిబ్యూర్, కేంద్ర కమిటీ లేదని వారంతా లొంగిపోయారని లేదా అరెస్టయ్యారని, లేదా ఎన్కౌంటర్ అయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొన్న పార్లమెంటులో వెల్లడించారు. దాదాపుగా దేశంలో నక్సలిజం అంతమైపోయిందని డెడ్లైన్ ఒక రోజు ముందు ప్రకటించారు. తమ రాష్ట్రంలో నక్సలిజం లేదని మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రకటించింది.
తమ రాష్ట్రం నుంచి ఉద్యమంలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉన్నారని తెలంగాణ వెల్లడించింది. సుమారు డజను మంది నక్సలైట్లు మిగిలారని, వారి లక్ష్యంగానే ఆపరేషన్ చేపడుతామని ఒడిశా పేర్కొంది. డెడ్లైన్తోనే నక్సలైట్ల లొంగుబాటు కార్యక్రమం ముగిసిందని, ఇక లొంగుబాట్లకు అవకాశం లేదని, ఉన్నవారిని ఎన్కౌంటర్ చేయడమే మిగిలిన లక్ష్యమని ఒడిశా ఏడీజీపీ సంజీబ్ పాండా స్పష్టం చేశారు.
ఆరు దశాబ్దాలుగా కొనసాగిన విప్లవ పోరాటం…
ఆరు దశాబ్దాలుగా మన దేశంలోని అనేక రాష్ర్టాల్లో విప్లవ పోరాటం కొనసాగింది. ది. తొలినాళ్లలో విశేష ప్రజాధారణతో దావానలంలా వ్యాపించింది. దాదాపు డజను రాష్ట్రాలకు విస్తరించిన ఉద్యమం క్రమంగా ప్రధానంగా 3 నాలుగు రాష్ట్రాలకు కుచించుకుపోయింది. పీక్ స్టేజ్లో 126 జిల్లాల్లో కార్యకలాపాలు సాగించిన మావోయిస్టు పార్టీ.. దండకారణ్యంలో కొన్నాళ్లు సమాంతర ప్రభుత్వాన్నీ నడిపింది.
కాగా, 2019లో దేశంలో మావోయిజాన్ని పూర్తిగా అంతమొందించాలని కేంద్రం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. 2024లో ఛత్తీస్గడ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆపరేషన్ కగార్ అనూహ్య వేగాన్ని అందుకుంది. రెండేండ్ల ముందుగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా డెడ్లైన్ విధించారు. 2023లో ఆపరేషన్ కగార్ మొదలుపెట్టాక మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూ వచ్చింది.
పార్టీని దాదాపుగా అంతమొందించే లక్ష్యంలో ఈ ఆపరేషన్ సఫలమవ్వగా గతేడాది ఏప్రిల్ 21 నుంచి మే 11 మధ్య కర్రెగుట్టలు టార్గెట్గా చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో పార్టీ చీఫ్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ ఒక కుదుపు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కమాండర్ మాడ్వి హిడ్మా ఎన్కౌంటర్తో పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది.
కగార్లో తుడిచిపెట్టుకపోయిన అగ్రనాయకత్వం…
కగార్ ఆపరేషన్లో భాగంగా జరిగిన ఎన్కౌంటర్లలో నంబాల, చలపతి, వివేక్, గౌతమ్, గాజర్ల రవి, భాస్కర్, కట్టా రామచంద్రారెడ్డి, కదిరి సత్యనారాయణ రెడ్డి, హిడ్మా, గణేశ్, ప్రయాగ్లు మరణించగా.. సోనూ, ఆశన్న, దేవ్జీ, మల్లా రాజిరెడ్డి వంటి అగ్రనాయకత్వం లొంగిపోయింది. దీంతో మావోయిస్టు పార్టీకి నాయకత్వం దాదాపుగా లేకుండా పోయింది. దీంతో కిందిస్థాయి కేడర్లు కూడా పెద్ద సంఖ్యలో లొంగుబాటపట్టారు. డెడ్లైన్ లోపు మావోయిస్టు పార్టీ క్రియాశీలక నాయకత్వం దాదాపుగా లేకుండాపోయింది.
మావోయిస్టు రహిత రాష్ర్టంగా దేశం…
ఆపరేషన్ కగార్ ప్రభావంతో దాదాపు మన దేశంలో మావోయిస్టు పార్టీ ఉనికి లేదని చెప్పొచ్చని స్వయంగా కేంద్రమంత్రి అమిత్ షానే చెప్పారు. అయితే, ఫార్మల్గా త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకా అజ్ఞాతంలోనే ఉన్న మావోయిస్టు పార్టీ కీలక నేతలు గణపతి, మిసిర్ బెస్రా, పసునూరి నరహరిల చుట్టూ ఆసక్తి నెలకొంది. మావోయిస్టు పార్టీ మాజీ చీఫ్ గణపతి అడవిలో లేడని, పట్టణ ప్రాంతంలోనే ఉండి ఉంటాడని తెలంగాణ పోలీసులు పేర్కొన్నారు.
